కాసేపట్లో జోగి రమేశ్ ఇంటికి జగన్.. రూటు మార్చుకున్న వైసీపీ అధినేత

  • జోగి రమేశ్ ఇంటిపై దాడి చేసిన టీడీపీ కార్యకర్తలు
  • జోగి రమేశ్ ను, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించనున్న జగన్
  • వైసీపీకి మరో రూట్ మ్యాప్ ఇచ్చిన పోలీసులు
మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్ నివాసంపై టీడీపీ కార్యకర్తలు దాడి చేసిన సంగతి తెలిసిందే. మంత్రి నారా లోకేశ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో జోగి నివాసంపై దాడి చేసి, నిప్పు పెట్టారు. ఈ క్రమంలో, జోగి రమేశ్ ను పరామర్శించేందుకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి కాసేపట్లో జగన్ బయల్దేరనున్నారు. 

ఇబ్రహీంపట్నంలోని జోగి రమేశ్ నివాసానికి వెళ్లేందుకు పోలీసులకు వైసీపీ ఒక రూట్ మ్యాప్ ఇచ్చింది. అయితే, శాంతిభద్రతల దృష్ట్యా వైసీపీకి పోలీసులు మరో రూట్ మ్యాప్ ఇచ్చారు. ఈ క్రమంలో, పోలీసులు ఇచ్చిన రూట్ మ్యాప్ ను ఫాలో కాబోమని తొలుత చెప్పిన వైసీపీ... చివరకు తన నిర్ణయం మార్చుకుంది. పోలీసులు సూచించిన మార్గంలోనే జోగి రమేశ్ నివాసానికి జగన్ వెళ్లనున్నారు. 

పోలీసులు ఇచ్చిన రూట్ మ్యాప్ ప్రకారం... తాడేపల్లి నుంచి మంగళగిరి బైపాస్, కాజ వెస్ట్ బైపాస్, గుంటుపల్లి మీదుగా ఇబ్రహీంపట్నంకు జగన్ చేరుకోనున్నారు. ఈ సందర్భంగా జోగి రమేశ్ ను, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, ధ్వంసమైన ఇంటిని పరిశీలించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు ఆయన తాడేపల్లికి చేరుకుంటారు.


More Telugu News