విశాఖ రైల్వేస్టేషన్ లో 'రోబో పోలీస్ అధికారి'... దేశంలోనే తొలిసారి... వీడియో ఇదిగో!

  • విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో 'ఏఎస్సీ అర్జున్' రోబో సేవలు ప్రారంభం
  • భారతీయ రైల్వే చరిత్రలో ఇలాంటి ప్రయోగం ఇదే మొదటిసారి
  • ప్రయాణికుల భద్రత, సహాయం కోసం రోబోను ప్రవేశపెట్టిన ఆర్పీఎఫ్
  • ఈ రోబోను పూర్తిగా విశాఖపట్నంలోనే దేశీయంగా అభివృద్ధి చేశారు
భారతీయ రైల్వే చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. దేశంలోనే తొలిసారిగా విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో 'ఏఎస్సీ అర్జున్' అనే హ్యూమనాయిడ్ రోబోను ప్రవేశపెట్టారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే (ECoR) ఆధ్వర్యంలోని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) ఈ వినూత్న కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించింది. రైల్వే కార్యకలాపాల్లో ఆధునిక టెక్నాలజీని వినియోగించడంలో ఇది ఒక మైలురాయిగా నిలవనుంది.

ప్రయాణికుల భద్రత, భద్రతా ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు వారికి మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ఈ రోబోను అందుబాటులోకి తెచ్చినట్లు రైల్వే అధికారులు తెలిపారు. 'ఏఎస్సీ అర్జున్' రోబో.. ప్రయాణికులకు సహాయం చేయడం, రద్దీని నియంత్రించడం, పరిశుభ్రతను పర్యవేక్షించడం, భద్రతాపరమైన అవగాహన కల్పించడం వంటి పనులను నిర్వర్తిస్తుంది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌ను ఆధునికీకరించే ప్రయత్నాల్లో భాగంగా ఈ రోబోను ప్రవేశపెట్టారు.

ఈ రోబోను పూర్తిగా విశాఖపట్నంలోనే దేశీయంగా డిజైన్ చేసి అభివృద్ధి చేయడం విశేషం. ఏడాదికి పైగా సమయం వెచ్చించి ఈ టెక్నాలజీని రూపొందించినట్లు అధికారులు వెల్లడించారు. ప్రయాణికుల సేవల్లో టెక్నాలజీని అనుసంధానించడంలో ఈ రోబో సేవలు కీలక పాత్ర పోషిస్తాయని ఈస్ట్ కోస్ట్ రైల్వే భావిస్తోంది.


More Telugu News