ఏపీలో తక్కువ జనాభా అయినా నిధుల్లో టాప్ 3లో ఏపీ: పెమ్మసాని చంద్రశేఖర్

Pemmasani Chandra Sekhar says Andhra Pradesh ranks top 3 in central funds despite lower population
  • తక్కువ జనాభా ఉన్నప్పటికీ కేంద్ర నిధుల వాటాలో ఏపీ దేశంలోనే మూడో స్థానంలో ఉందని వెల్లడి
  • ఉపాధి హామీ పథకం కింద రాష్ట్రానికి రూ.7,700 కోట్లు అందాయన్న కేంద్ర మంత్రి
  • అమరావతిలో కేంద్ర ప్రభుత్వ భవనాల నిర్మాణం మూడేళ్లలో పూర్తవుతుందని వెల్లడి
తక్కువ జనాభా ఉన్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు పొందుతున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో నిలిచిందని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. బుధవారం ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆయన, రాష్ట్రానికి లభిస్తున్న ప్రత్యేక ప్రయోజనాల వల్లే ఈ స్థాయిలో నిధులు మంజురవుతున్నాయని వివరించారు.

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGA) కింద ఆంధ్రప్రదేశ్‌కు ఇప్పటి వరకు రూ.7,700 కోట్లు అందాయని పెమ్మసాని వెల్లడించారు. అలాగే, రాష్ట్ర రాజధాని అమరావతిలో కీలక భవనాల నిర్మాణాన్ని కేంద్ర ప్రభుత్వ రాబోయే మూడేళ్లలో పూర్తి చేసే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఈ ప్రాజెక్టులకు అవసరమైన భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించగా, నిర్మాణ వ్యయాన్ని పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే భరించనుందని ఆయన పేర్కొన్నారు.

అమరావతి క్యాపిటల్ నిర్మాణం, సెంట్రల్ సెక్రటేరియట్, ఔటర్ రింగ్ రోడ్ వంటి ప్రాజెక్టులు రాష్ట్ర అభివృద్ధికి అత్యంత కీలకమని మంత్రి స్పష్టం చేశారు. ఈ అంశాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏపీ అభివృద్ధిని వేగవంతం చేసే ప్రక్రియలో భాగంగా ఈ నిర్ణయాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు మెరుగుపడటంతో పాటు, పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
Go Back to Shorts
Pemmasani Chandra Sekhar
Andhra Pradesh Central Funds
MGNREGA AP Budget
Amaravati Capital Development

More Telugu News