భారతీయులున్న నౌకపై యూఎస్ దాడి: భారత్ తీవ్ర నిరసన.. అమెరికన్ దౌత్యవేత్తకు సమన్లు
- ఒమన్ గల్ఫ్లో ఆయిల్ ట్యాంకర్పై అమెరికా దాడి
- నౌకలో 24 మంది భారత సిబ్బంది.. 21 మంది సురక్షితం
- దాడిని ఖండిస్తూ అమెరికా దౌత్యవేత్తకు భారత్ సమన్లు
- గల్లంతైన ముగ్గురి కోసం కొనసాగుతున్న గాలింపు చర్యలు
పలావు జెండాతో ఉన్న 'ఎంటీ మారివెక్స్' అనే ఆయిల్ ట్యాంకర్ను లక్ష్యంగా చేసుకుని అమెరికా ఈ దాడికి పాల్పడింది. ఇరాన్పై విధించిన ఆంక్షలను ఉల్లంఘించి ఆ నౌక ప్రయాణించిందని, తమ ఆదేశాలను పాటించకపోవడంతో ఇంజిన్ రూమ్ను ధ్వంసం చేసేందుకు దాడి చేయాల్సి వచ్చిందని యూఎస్ సెంట్రల్ కమాండ్ (సెంట్కామ్) ప్రకటించింది. యూఎస్ఎస్ అబ్రహం లింకన్ యుద్ధనౌక నుంచి బయలుదేరిన ఎఫ్-18 ఫైటర్ జెట్ ఈ దాడిలో పాల్గొన్నట్లు తెలుస్తోంది.
దాడి జరిగిన తరుణంలో నౌకలోని భారత సిబ్బంది పంపిన అత్యవసర సందేశాలు ఆందోళన తీవ్ర ఆందోళన కలిగించాయి. "మా నౌకపై అమెరికా నేవీ క్షిపణి దాడి చేసింది. దీనివల్ల ఇంజిన్ రూమ్ దెబ్బతినడమే కాకుండా, నౌక కింద భాగంలో రంధ్రం పడింది. మేమంతా 24 మంది భారతీయ సిబ్బంది ఉన్నాం, దయచేసి త్వరగా మమ్మల్ని రక్షించండి" అంటూ వారు వేడుకున్నారు. ఈ సమాచారం అందిన వెంటనే స్పందించిన ఒమన్ నావికాదళ, హెలికాప్టర్ల ద్వారా సిబ్బందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది.
ఈ పరిణామాలను భారత విదేశాంగ శాఖ నిరంతరం పర్యవేక్షిస్తోంది. గల్లంతైన ముగ్గురు సిబ్బంది కోసం ఒమన్ అధికారుల సమన్వయంతో గాలింపు చర్యలను ముమ్మరం చేసినట్లు వెల్లడించింది. సమస్యాత్మక జలాల్లో ప్రయాణించే భారతీయ పౌరులు, వాణిజ్య నౌకల భద్రతకే తమ ప్రథమ ప్రాధాన్యత అని భారత్ స్పష్టం చేసింది. ఇరాన్తో నెలకొన్న విభేదాల నేపథ్యంలో అమెరికా ఆంక్షలను కఠినంగా అమలు చేస్తుండటంతో, ఈ ప్రాంతంలో తరచూ ఇటువంటి ఉద్రిక్త ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.