రాజస్థాన్‌లో కారులో 150 కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనం

  • పేలుడు పదార్థాలను యూరియా సంచులలో దాచిన నిందితులు
  • వాహనంలో దాదాపు 200 పేలుడు కాట్రిడ్జ్‌లు, ఆరు కట్టల సేఫ్టీ ఫ్యూజ్ వైర్ గుర్తింపు
  • బుండి నుంచి టోంక్‌కు తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు
రాజస్థాన్‌లోని టోంక్ జిల్లాలో 150 కిలోల అక్రమ అమ్మోనియం నైట్రేట్‌తో కూడిన పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. యూరియా ఎరువుల సంచులలో దాచి ఉంచిన ఈ పేలుడు పదార్థాలతో పాటు, దాదాపు 200 పేలుడు కాట్రిడ్జ్‌లు, ఆరు కట్టల సేఫ్టీ ఫ్యూజ్ వైర్ (సుమారు 1,100 మీటర్లు)ను కూడా గుర్తించారు.

బరోని పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనాన్ని అడ్డుకున్నట్లు అధికారులు తెలిపారు. నిందితులు పేలుడు పదార్థాలను బుండి నుంచి టోంక్‌కు తరలిస్తుండగా పట్టుబడ్డారు.

టోంక్ జిల్లా పోలీసులకు నిఘా వర్గాల ద్వారా అందిన సమాచారం మేరకు, బరోని పోలీస్ స్టేషన్ పరిధిలో అనుమానాస్పదంగా ఉన్న కారును తనిఖీ చేయగా యూరియా సంచుల్లో అమ్మోనియం నైట్రేట్ ఉన్నట్లు గుర్తించారు.

ఈ ఘటనలో సురేంద్ర మోచి, సురేంద్ర పట్వా అనే ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. పేలుడు పదార్థాలు ఎక్కడి నుంచి సేకరించారు, వాటిని ఎందుకు ఉపయోగించాలనుకున్నారు అనే విషయాలపై పోలీసులు వారిని విచారిస్తున్నారు.


More Telugu News