రూ.1.7 కోట్ల అప్పు రూ.146 కోట్లు అయింది.. వడ్డీల ఊబిలో చిక్కుకున్న ఓ వ్యక్తి దుస్థితి!

  • సింగపూర్‌లో రూ.1.7 కోట్ల అప్పు తీసుకున్న వ్యక్తి
  • అధిక వడ్డీలతో అప్పు రూ.146 కోట్లకు చేరిక
  • అప్పు తీర్చడానికి సొంతిల్లు అమ్మి అద్దెకు ఉన్న వైనం
  • ఈ వ్యవహారం మనస్సాక్షిని కదిలించిందన్న హైకోర్టు న్యాయమూర్తి
  • కేసుపై లోతైన దర్యాప్తునకు రీట్రయల్‌కు ఆదేశం
సింగపూర్‌లో ఓ వ్యక్తి రూ.1.7 కోట్లు అప్పు తీసుకుని, అధిక వడ్డీల కారణంగా ఏకంగా రూ.146 కోట్లు చెల్లించాల్సిన దుస్థితికి చేరుకున్నాడు. ఈ అప్పుల ఊబిలో చిక్కుకుని తన సొంతిల్లు కూడా కోల్పోవాల్సి వచ్చింది. ఈ షాకింగ్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళితే, 2010-11 మధ్యలో సింగపూర్‌కు చెందిన ఓ వ్యక్తి లైసెన్స్ ఉన్న ఫైనాన్స్ కంపెనీ నుంచి 2.5 లక్షల సింగపూర్ డాలర్లు (సుమారు రూ.1.7 కోట్లు) అప్పుగా తీసుకున్నాడు. దీనిపై ఆ సంస్థ నెలకు 4 శాతం వడ్డీ విధించింది. వాయిదాలు ఆలస్యంగా చెల్లించడంతో నెలకు 8 శాతం అదనపు వడ్డీ, ప్రాసెసింగ్ ఫీజు కింద నెలకు 2,500 డాలర్లు వసూలు చేసింది. దీంతో కేవలం నాలుగేళ్లలోనే అసలు, వడ్డీలు కలిసి అప్పు 3 మిలియన్ డాలర్లకు పెరిగిపోయింది.

అప్పు చెల్లింపులు భారంగా మారడంతో, 2016 జులైలో ఆ వ్యక్తి తన ఇంటిని సదరు ఫైనాన్స్ కంపెనీ డైరెక్టర్‌కే 2.1 మిలియన్ డాలర్లకు (సుమారు రూ.14 కోట్లు) విక్రయించాడు. కుటుంబాన్ని రోడ్డున పడనీయకుండా, అదే ఇంట్లో నెలకు 7,000 నుంచి 8,500 డాలర్ల అద్దె చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అయినప్పటికీ అప్పు పెరుగుతూనే పోయింది. 2021 చివరి నాటికి అది దాదాపు 21 మిలియన్ డాలర్లకు (రూ.146 కోట్లు) చేరింది.

అయితే, ఆ వ్యక్తి అద్దె చెల్లించలేదని, ఇల్లు ఖాళీ చేయడం లేదని సదరు ఫైనాన్స్ కంపెనీ డైరెక్టర్ కోర్టును ఆశ్రయించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ కేసుపై విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి ఫిలిప్ జయరత్నం దీనిపై లోతైన దర్యాప్తు అవసరమని భావించారు. "కేవలం రూ.1.7 కోట్ల అప్పుకు వడ్డీలు, ఫీజుల రూపంలో కోట్లాది డాలర్లు చెల్లించాల్సి రావడం మనసును కదిలించే విషయం" అని ఆయన వ్యాఖ్యానించారు. అప్పు, అద్దె ఒప్పందాల్లో ఏదైనా చట్టవిరుద్ధమైన అంశం ఉందేమో తేల్చాలని రీట్రయల్‌కు ఆదేశించారు. అయితే, ఇందులో తమ తప్పేమీ లేదని, అతడి దుస్థితికి అతడే కారణమని కంపెనీ డైరెక్టర్ వాదించారు.


More Telugu News