Vijayawada: న్యూ ఇయర్ వేడుకలపై పోలీసుల ఉక్కుపాదం.. విజయవాడలో కఠిన ఆంక్షలు

Vijayawada Police Issue Guidelines for Peaceful New Year
  • నగరంలోని అన్ని ఫ్లైఓవర్లను రాత్రిపూట మూసివేయనున్న పోలీసులు
  • రోడ్లపై కేక్ కటింగ్‌లు, సంబరాలపై పూర్తిస్థాయి నిషేధం
  • మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
  • బైక్ విన్యాసాలు, ట్రిపుల్ రైడింగ్‌పై ప్రత్యేక నిఘా
కొత్త సంవత్సర వేడుకల నేపథ్యంలో విజయవాడ నగరంలో పోలీసులు కఠిన ఆంక్షలు విధించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతిభద్రతల పరిరక్షణకు పటిష్ఠ‌మైన చర్యలు తీసుకుంటున్నట్లు నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు వెల్లడించారు. ఈ నెల‌ 31 రాత్రి వేడుకల సందర్భంగా నగరంలోని బెంజ్ సర్కిల్, కనకదుర్గ ఫ్లైఓవర్‌తో సహా అన్ని ఫ్లైఓవర్లను మూసివేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ నిబంధన జనవరి 13వ తేదీ వరకు రాత్రి వేళల్లో అమలులో ఉంటుందని తెలిపారు.

నూతన సంవత్సర సంబరాల పేరుతో రోడ్లపైకి వచ్చి కేకులు కట్ చేయడం, బాణసంచా కాల్చడం, గుంపులుగా చేరి హడావుడి చేయడం వంటివి పూర్తిగా నిషేధించినట్లు సీపీ తెలిపారు. ముఖ్యంగా యువత అతివేగంగా వాహనాలు నడపడం, బైక్‌లపై ప్రమాదకర విన్యాసాలు చేయడం, సైలెన్సర్లు తీసి శబ్ద కాలుష్యం సృష్టించడం వంటివి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిని పట్టుకునేందుకు ప్రత్యేక డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తామన్నారు.

నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. ట్రిపుల్ రైడింగ్ చేసే వారిపై కూడా కఠినంగా వ్యవహరిస్తామన్నారు. ప్రజలందరూ పోలీసులకు సహకరించి, కొత్త సంవత్సర వేడుకలను ప్రశాంత వాతావరణంలో తమ ఇళ్ల వద్దే జరుపుకోవాలని సీపీ రాజశేఖర్ బాబు సూచించారు.
Vijayawada
Rajasekhar Babu
New Year celebrations
police restrictions
traffic rules
Drunk and drive
flyovers closed
Andhra Pradesh
New Year Safety
Vijayawada police

More Telugu News