పెన్సిలే ఆ పసివాడికి మృత్యుపాశం.. కింద పడటంతో గొంతులోకి దిగబడి ఆరేళ్ల బాలుడి మృతి!
- ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో ఘటన
- టాయిలెట్కు వెళ్లి వస్తుండగా కాలుజారి కిందడిన బాలుడు
- ఆ సమయంలో చేతిలో ఉన్న పెన్సిల్ గొంతులోకి దూసుకెళ్లిన వైనం
- ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో కన్నుమూత
గ్రామానికి చెందిన మేడారపు ఉపేంద్రాచారి, మౌనిక దంపతుల చిన్న కుమారుడు విహార్ (6) స్థానిక ప్రైవేట్ పాఠశాలలో యూకేజీ చదువుతున్నాడు. బుధవారం మధ్యాహ్నం విరామ సమయంలో విహార్ మూత్రశాలకు వెళ్లాడు. తిరిగి క్లాస్రూమ్కు పరుగెత్తుకుంటూ వస్తుండగా మైదానంలో అకస్మాత్తుగా కాలు జారి బోర్లా పడిపోయాడు. దురదృష్టవశాత్తూ ఆ సమయంలో బాలుడి చేతిలో ఉన్న పెన్సిల్ గొంతులోకి బలంగా దిగబడటంతో తీవ్ర రక్తస్రావమైంది.
బాలుడి పరిస్థితిని గమనించిన ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది వెంటనే స్పందించి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే, గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో మార్గమధ్యంలోనే విహార్ కన్నుమూశాడు. సమాచారం అందుకున్న తల్లిదండ్రులు ఆసుపత్రికి చేరుకుని తమ కుమారుడి నిర్జీవ దేహాన్ని చూసి గుండెలవిసేలా రోదించిన తీరు అక్కడి వారిని కన్నీరు పెట్టించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.