క్రికెట్ కు గుడ్ బై చెప్పిన కృష్ణప్ప గౌతమ్

  • అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు వీడ్కోలు పలికిన కృష్ణప్ప గౌతమ్
  • భారత్ తరఫున ఒకే ఒక్క వన్డే ఆడిన కర్ణాటక ఆల్‌రౌండర్
  • ఐపీఎల్ 2021లో అత్యంత ఖరీదైన అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా రికార్డ్
  • కేపీఎల్‌లో ఒకే మ్యాచ్‌లో సెంచరీ, 8 వికెట్లతో అద్భుత ప్రదర్శన
భారత క్రికెటర్, కర్ణాటక ఆల్‌రౌండర్ కృష్ణప్ప గౌతమ్ తన ప్రొఫెషనల్ క్రికెట్ కెరీర్‌కు ముగింపు పలికాడు. సోమవారం అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్ అవుతున్నట్లు అధికారికంగా ప్రకటించాడు. బెంగళూరులోని కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (KSCA) మీడియా లాంజ్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఈ నిర్ణయాన్ని వెల్లడించాడు. ఈ కార్యక్రమానికి కేఎస్‌సీఏ అధ్యక్షుడు వెంకటేశ్ ప్రసాద్, ఉపాధ్యక్షుడు సుజిత్ సోమసుందర్, కార్యదర్శి సంతోష్ మీనన్ హాజరయ్యాడు

37 ఏళ్ల గౌతమ్, 2021 జూలై 23న శ్రీలంకపై తన ఏకైక అంతర్జాతీయ వన్డే మ్యాచ్ ఆడారు. ఆ మ్యాచ్‌లో వికెట్ కీపర్ మినోద్ భానుకను ఔట్ చేసి తన ఏకైక అంతర్జాతీయ వికెట్‌ను ఖాతాలో వేసుకున్నాడు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ద్వారా కృష్ణప్ప గౌతమ్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. ఐపీఎల్ 2021 వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ అతడిని రూ. 9.25 కోట్లకు కొనుగోలు చేయడంతో, అప్పటివరకు అత్యంత ఖరీదైన అన్‌క్యాప్డ్ భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. తన ఐపీఎల్ కెరీర్‌లో ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. 2024 మే నెలలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచే ఐపీఎల్‌లో అతడి చివరి మ్యాచ్.

ఐపీఎల్‌లో 36 మ్యాచ్‌లలో, ఈ ఫ్లెక్సిబుల్ బౌలింగ్ ఆల్‌రౌండర్ 247 రన్స్ స్కోర్ చేశాడు... అలాగే 21 వికెట్లు తీశాడు. దేశీయ క్రికెట్‌లోనూ మెరుగైన ప్రదర్శన చేశాడు, 32 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలో 737 రన్స్ చేసి, 116 వికెట్లు సాధించాడు. లిస్ట్ ఎ మ్యాచ్‌లలో అతను 32 మ్యాచ్‌లలో 400 రన్స్ స్కోర్ చేసి, 51 వికెట్లు తీశాడు, అతని టీ20 కెరీర్‌లో 49 మ్యాచ్ లలో 454 రన్స్ మరియు 32 వికెట్లు సాధించాడు.

ముఖ్యంగా 2019 కర్ణాటక ప్రీమియర్ లీగ్‌లో బళ్లారి టస్కర్స్ తరఫున ఆడుతూ ఒకే మ్యాచ్‌లో 56 బంతుల్లో 134 పరుగులు చేసి, ఆ తర్వాత బౌలింగ్‌లో 15 పరుగులకే 8 వికెట్లు పడగొట్టి చరిత్ర సృష్టించాడు. ఈ అసాధారణ ప్రదర్శన అతని కెరీర్‌లోనే ఒక మైలురాయిగా నిలిచిపోయింది.


More Telugu News