ఏపీలో లారీ ఓనర్ల సమ్మె తాత్కాలికంగా వాయిదా
- ఫిట్నెస్ చార్జీల పెంపును నిరసిస్తూ సమ్మెకు పిలుపునిచ్చిన లారీ ఓనర్ల సంఘం
- ప్రభుత్వంతో జరిపిన చర్చలు విజయవంతం
- ప్రజలకు ఇబ్బందులు కలగకుండా... ప్రభుత్వం చొరవ
లారీల ఫిట్నెస్ చార్జీలను ప్రభుత్వం పెంచడాన్ని నిరసిస్తూ లారీ ఓనర్ల సంఘం సమ్మెకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. సమ్మెలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని రవాణా వాహనాలను ఈ అర్ధరాత్రి నుంచి నిలిపివేస్తామని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రజలకు రవాణా పరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నివారించేందుకు కూటమి ప్రభుత్వం వెంటనే రంగంలోకి దిగింది.
లారీ ఓనర్ల అసోసియేషన్ నేతలను చర్చలకు ఆహ్వానించి, వారి సమస్యలను అడిగి తెలుసుకుంది. ప్రభుత్వ సానుకూల స్పందనతో లారీ యజమానుల సంఘం తమ సమ్మెను తాత్కాలికంగా విరమించుకుంది. దీంతో రాష్ట్రంలో రవాణా సేవలకు ఎదురవబోయే పెద్ద ఆటంకం తప్పినట్లయింది.