ఏపీ సీఎస్ పదవీకాలం పొడిగింపు!

  • 2026 ఫిబ్రవరి వరకు సీఎస్‌గా బాధ్యతలు
  • విజయానంద్‌ తర్వాత నూతన సీఎస్‌గా సాయిప్రసాద్
  • ఇద్దరు అధికారులకు ప్రభుత్వం నుంచి అందిన సమాచారం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) కె. విజయానంద్ పదవీ కాలాన్ని పొడిగిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన పదవీకాలం ఈ నెలాఖరుతో ముగియనుండగా, మరో మూడు నెలల పాటు ఆయన సర్వీసును పొడిగించాలని నిర్ణయించారు. ఈ నిర్ణయంతో విజయానంద్ 2026 ఫిబ్రవరి వరకు సీఎస్‌గా బాధ్యతల్లో కొనసాగనున్నారు.

ప్రభుత్వ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం.. విజయానంద్ పదవీకాలం ముగిసిన తర్వాత తదుపరి సీఎస్‌గా ప్రస్తుతం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న సాయిప్రసాద్‌కు అవకాశం కల్పించనున్నారు. సాయిప్రసాద్ పదవీకాలం 2026 మే నెలతో ముగియనుంది. ఆ తర్వాత కూడా ఆయన సేవలను ప్రభుత్వం వినియోగించుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ మేరకు ప్రభుత్వ పెద్దల నుంచి ఇద్దరు ఉన్నతాధికారులకు స్పష్టమైన సమాచారం అందినట్లు సమాచారం. పరిపాలనలో సీనియర్ అధికారుల అనుభవాన్ని వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. 


More Telugu News