జూబ్లీహిల్స్‌లో గెలిచిన నవీన్ యాదవ్‌ను వారికి పరిచయం చేశాను: రేవంత్ రెడ్డి ట్వీట్

  • నవీన్ యాదవ్‌తో పాటు పలువురు నేతలతో కలిసి అగ్రనేతలను కలిసిన రేవంత్ రెడ్డి
  • ఖర్గే, రాహుల్ గాంధీలకు నవీన్ యాదవ్‌ను పరిచయం చేసిన రేవంత్ రెడ్డి
  • నవీన్ యాదవ్‌ను అభినందించిన అగ్రనేతలు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన నవీన్ యాదవ్‌ను కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి పరిచయం చేసినట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఆయన ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. నవీన్ యాదవ్‌తో పాటు పలువురు నేతలతో కలిసి రాహుల్ గాంధీని కలిశారు. అనంతరం ఆయన 'ఎక్స్' వేదికగా ఈ విషయాన్ని ట్వీట్ చేశారు.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన నేపథ్యంలో ఢిల్లీలో రాహుల్ గాంధీని మర్యాదపూర్వకంగా కలిసినట్లు ఆయన పేర్కొన్నారు. నవీన్ యాదవ్‌ను రాహుల్ గాంధీ వద్దకు తీసుకువెళ్లినట్లు తెలిపారు. రాహుల్ గాంధీని కలిసిన అనంతరం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కూడా కలిసినట్లు రేవంత్ రెడ్డి మరో ట్వీట్‌లో వెల్లడించారు.

ఖర్గేను, రాహుల్ గాంధీని కలిసిన సమయంలో నవీన్ యాదవ్‌తో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ, ఖర్గేలు ఉప ఎన్నికలో విజయం సాధించిన నవీన్ యాదవ్‌ను అభినందించారు.


More Telugu News