ప్రధాని మోదీ చాలా మంచివారు... గుండె ఆపరేషన్లతో కోలుకున్న చిన్నారుల మాట
- ఛత్తీస్గఢ్ లో ప్రధాని మోదీ పర్యటన
- నవ రాయ్పూర్లో సత్యసాయి గుండె ఆసుపత్రి సందర్శన
- గుండె ఆపరేషన్లతో కోలుకున్న 2,500 మంది చిన్నారులతో ముఖాముఖి
- ప్రధానిని కలవడంపై చిన్నారులు ఆనందం, ఉత్సాహం
ఈ సందర్భంగా చిన్నారుల కేరింతలు, నవ్వులతో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది. ప్రధాని మోదీ వారి వద్దకు వెళ్లి చదువు, ఆరోగ్యం, భవిష్యత్ లక్ష్యాల గురించి ఆప్యాయంగా అడిగి తెలుసుకున్నారు. ఆయనతో మాట్లాడిన చిన్నారులు తమ ఆనందాన్ని పంచుకున్నారు.
"ప్రధాని మోదీని కలవడం నాకు చాలా సంతోషంగా అనిపించింది" అని వారణాసికి చెందిన కృష్ణ విశ్వకర్మ ఆనందంగా చెప్పాడు. "మోదీ గారు నా పేరు అడిగి, దాన్ని మళ్లీ పలికారు. ఏ క్లాస్ చదువుతున్నావని కూడా అడిగారు. ఆ క్షణాన్ని ఎప్పటికీ మర్చిపోలేను" అని ఆయుషి సూర్యవంశి అనే బాలిక గుర్తుచేసుకుంది. "ఆయన చాలా మంచివారు" అని యాషిక అనే చిన్నారి ఉత్సాహంగా చెప్పింది. 2017లో ఆపరేషన్ చేయించుకున్న కావ్య మిశ్రా మాట్లాడుతూ, "ప్రధానిని కలవడం నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది" అని తెలిపింది.
వేలాది మంది చిన్నారులకు ఉచితంగా గుండె సంబంధిత చికిత్స అందిస్తూ పునర్జన్మ ప్రసాదిస్తున్న ఆసుపత్రి యాజమాన్యాన్ని, వైద్యులను, నర్సులను ప్రధాని మనస్ఫూర్తిగా అభినందించారు. వారి సేవలు అమూల్యమైనవని కొనియాడారు.
ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బ్రహ్మకుమారీలు ఏర్పాటు చేసిన 'శాంతి శిఖర్' ఆధ్యాత్మిక కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం, నవ రాయ్పూర్లోని నూతన ఛత్తీస్గఢ్ శాసనసభ భవనంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ భవనాన్ని సౌరశక్తి, వర్షపు నీటి సంరక్షణ వంటి పర్యావరణ హితమైన పద్ధతులతో నిర్మించారు.
అంతకుముందు, రాష్ట్ర రజతోత్సవ వేడుకల సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ప్రధాని మాట్లాడుతూ.. భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లిలాంటిదని అన్నారు. "మన గిరిజన సమాజం తరతరాలుగా ప్రజాస్వామ్య సంప్రదాయాలను నిలబెట్టింది. బస్తర్లోని మురియా దర్బార్ సంస్కృతి దీనికి నిదర్శనం. ఈ సంప్రదాయానికి కొత్త విధానసభలో చోటు కల్పించడం సంతోషంగా ఉంది" అని ఆయన పేర్కొన్నారు.