వయనాడ్ టూరిజం ప్రమోషన్.. కర్ణాటక సీఎం సిద్ధరామయ్యపై బీజేపీ విమర్శలు

  • కేరళలోని వయనాడ్ పర్యటనపై కర్ణాటక టూరిజం శాఖ పోస్ట్
  • ప్రియాంక గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం వయనాడ్
  • సీఎం కుర్చీ కాపాడుకునేందుకే ఈ ప్రచారమని సిద్ధరామయ్యపై బీజేపీ విమర్శలు
కర్ణాటక రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ పొరుగు రాష్ట్రమైన కేరళలోని వయనాడ్‌ను ప్రమోట్ చేస్తూ పెట్టిన ఓ సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు తీవ్ర రాజకీయ వివాదానికి దారితీసింది. కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ వయనాడ్ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన కుర్చీని కాపాడుకునేందుకు హైకమాండ్‌ను ప్రసన్నం చేసుకునేందుకే ఈ పని చేస్తున్నారని ప్రతిపక్ష బీజేపీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది.

వివరాల్లోకి వెళితే... ఈనెల 28న కేఎస్‌టీడీసీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో వయనాడ్ పర్యటనకు సంబంధించి రెండు రాత్రులు, మూడు రోజుల ప్యాకేజీని ప్రకటించింది. "ఉత్సాహం కావాలా? ప్రశాంతత కోరుకుంటున్నారా? రెండూ వయనాడ్‌లో పొందండి! అందమైన ట్రెక్కింగ్, జలపాతాలు, వన్యప్రాణులను కేఎస్‌టీడీసీతో కలిసి ఆస్వాదించండి. ప్రకృతిలో మీ అద్భుతమైన విహారం వేచి ఉంది" అంటూ పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్ వెలువడిన వెంటనే బీజేపీ నేతలు ప్రభుత్వంపై విమర్శల దాడిని ప్రారంభించారు.

ఈ వ్యవహారంపై శాసనసభ ప్రతిపక్ష నేత ఆర్. అశోక్ ఘాటుగా స్పందించారు. "వయనాడ్ జిల్లా కలెక్టర్‌గా, నిధులు సమీకరించే వ్యక్తిగా వ్యవహరించే ముఖ్యమంత్రిని కర్ణాటక ఇంకెంతకాలం భరించాలి?" అని ఆయన ప్రశ్నించారు. "మీరు కర్ణాటక పన్ను చెల్లింపుదారుల సొమ్ము రూ.10 కోట్లను కనీస ఆలోచన లేకుండా వయనాడ్‌కు రాసిచ్చారు. ఏనుగు దాడిలో చనిపోయిన వ్యక్తి కుటుంబానికి రూ.15 లక్షలు ఇచ్చారు. కొండచరియలు విరిగిపడితే వయనాడ్‌లో 100 ఇళ్లు కట్టిస్తామని ప్రకటించారు. ఇప్పుడు కర్ణాటక పర్యాటక సంస్థతో ప్రియాంక గాంధీ నియోజకవర్గానికి ప్రచారం చేయిస్తున్నారు" అని విమర్శించారు.

ఉత్తర కర్ణాటక వరదలతో అతలాకుతలమవుతుంటే, అక్కడి రైతులను గాలికొదిలేశారని అశోక్ మండిపడ్డారు. "12.5 లక్షల హెక్టార్లలో పంట నష్టం జరిగింది. కానీ పరిహారం మాత్రం ఫైళ్లు, సర్వేలు, సాకుల్లోనే ఇరుక్కుపోయింది. కలబురగి, రాయచూర్, యాద్గిర్, బీదర్, విజయపుర, బాగల్‌కోట్, బెలగావిలకు వరద సాయం ఎక్కడ? మీ ప్రాధాన్యతలు ఏమిటి?" అని ప్రభుత్వాన్ని నిలదీశారు.

"ఇది దాతృత్వం కాదు. తన కుర్చీని కాపాడుకోవడానికి హైకమాండ్‌ను ప్రసన్నం చేసుకోవడమే. మాకు కర్ణాటక ముఖ్యమంత్రి కావాలి కానీ, ఢిల్లీ కీలుబొమ్మ కాదు. వయనాడ్ బ్రాండ్ అంబాసిడర్ వద్దు. నకిలీ గాంధీ కుటుంబానికి మా ఖజానాను ఏటీఎంగా మార్చొద్దు. కర్ణాటకకే మొదటి ప్రాధాన్యత, వయనాడ్‌కు కాదు" అని అశోక్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

మరో బీజేపీ నేత సీటీ రవి కూడా స్పందిస్తూ, కర్ణాటక పర్యాటకాన్ని అభివృద్ధి చేయాల్సిన కేఎస్‌టీడీసీ.. కన్నడిగులను వయనాడ్‌కు ఆహ్వానించడం ఏంటని ప్రశ్నించారు. ప్రియాంక గాంధీని సంతోషపెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కన్నడ గౌరవాన్ని తాకట్టు పెడుతోందని ఆయన ఆరోపించారు. ఈ పరిణామం ప్రస్తుతం కర్ణాటక రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.


More Telugu News