ఒకే గ్రౌండ్ లో టీమిండియా, పాక్ జట్ల ప్రాక్టీస్

––
ఆసియా కప్ లో భాగంగా టీమిండియా, పాకిస్థాన్ జట్ల మధ్య ఇటీవల జరిగిన మ్యాచ్ వివాదాస్పదమైన సంగతి విదితమే. పాక్ జట్టుతో ఆడవద్దని భారత్ లో ఆందోళనలు జరిగాయి. అయినప్పటికీ మ్యాచ్ జరగడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ మ్యాచ్ లో టీమిండియా గెలిచిన అనంతరం ఆటగాళ్లు పాక్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడంపై దుమారం రేగింది. ఇదిలా కొనసాగుతుండగానే తాజాగా మరోసారి ఈ రెండు జట్లు ఎదురుపడ్డాయి.

ఒకే మైదానంలో ఇరుజట్లు ప్రాక్టీస్ చేశాయి. దుబాయ్‌ వేదికగా ఈ రోజు పాకిస్థాన్‌ జట్టు యూఏఈ జట్టుతో తలపడనుంది. ఈ మ్యాచ్‌ కోసం సన్నద్ధమయ్యేందుకు మంగళవారం పాక్‌ ఆటగాళ్లు దుబాయ్ మైదానానికి చేరుకున్నారు. అప్పటికే మైదానంలో టీమిండియా ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్నారు. అయితే, పాక్ ఆటగాళ్లు తమకు కేటాయించిన నెట్స్ లో ప్రాక్టీస్ చేశారు. ఇరు జట్ల హెడ్ కోచ్ లు గౌతమ్ గంభీర్, మైక్ హెస్సెన్ అక్కడే ఉండి తమ జట్లను పర్యవేక్షించారు.


More Telugu News