Telangana Government: శంషాబాద్‌లో కబ్జాదారులకు హైడ్రా షాక్: రూ.500 కోట్ల ప్రభుత్వ భూమి స్వాధీనం

Telangana Government Recovers 500 Crore Worth Land in Shamshabad
షార్ట్స్‌లో చూడండి
ప్రభుత్వ భూముల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించిన తెలంగాణ ప్రభుత్వం, కబ్జాదారులకు గట్టి హెచ్చరికలు జారీ చేసింది. తాజాగా, రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో అత్యంత విలువైన ప్రభుత్వ భూమిని హైడ్రా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శనివారం చేపట్టిన ఈ ఆపరేషన్‌లో సుమారు రూ.500 కోట్ల విలువైన 12 ఎకరాల స్థలాన్ని కబ్జాదారుల చెర నుంచి విడిపించారు.

శంషాబాద్ మండలం, శాతంరాయ్ గ్రామంలోని సర్వే నంబర్ 17లో ఉన్న ఈ 12 ఎకరాల భూమిని ప్రభుత్వం 2011లో ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బోర్డుకు కేటాయించింది. అయితే, కొంతకాలంగా ఈ స్థలంపై కన్నేసిన ఒక స్థానిక నాయకుడు, అనీష్ కన్స్ట్రక్షన్స్ అనే సంస్థ ద్వారా ఆక్రమణకు పాల్పడ్డారు. స్థలం చుట్టూ ప్రహరీ నిర్మించి, లోపల షెడ్లు వేసి తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ భూమిని అసఫ్ జాహీ పైగా కుటుంబ వారసుల నుంచి కొనుగోలు చేశామని చెబుతూ బోర్డులు కూడా ఏర్పాటు చేశారు.

అక్రమ నిర్మాణాలు ఊపందుకోవడంతో, ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు, స్థానిక ప్రజలు ఫొటోలతో సహా హైడ్రాకు ఫిర్యాదు చేశారు. దీంతో హైడ్రా అధికారులు వెంటనే రంగంలోకి దిగి, స్థానిక రెవెన్యూ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. ఈ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. శంషాబాద్ మండల పరిధిలో పైగా కుటుంబాలకు చెందిన భూములే లేవని రెవెన్యూ అధికారులు స్పష్టం చేశారు. వేరే ప్రాంతంలోని రికార్డులను చూపిస్తూ కబ్జాకు పాల్పడినట్లు తేలింది.

సమగ్ర ఆధారాలను పరిశీలించి, అది ప్రభుత్వ భూమి అని నిర్ధారించుకున్న తర్వాత హైడ్రా అధికారులు ఆక్రమణల తొలగింపు ప్రక్రియను ప్రారంభించారు. జేసీబీల సహాయంతో ప్రహరీ గోడను, షెడ్లను కూల్చివేశారు. అయితే, ఆ స్థలంలోని ఎకరం పరిధిలో ఉన్న కొన్ని నివాసాలు, ఒక ఆలయం, మసీదుకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మిగిలిన భూమిని స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఆ స్థలంలో "ఈ భూమి ప్రభుత్వానికి చెందినది" అని పేర్కొంటూ హైడ్రా హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేసింది.
Go Back to Shorts
Telangana Government
Shamshabad
government land
land encroachment
HYDRA
revenue officials

More Telugu News