తిరుపతి-షిర్డీ రైలుపై సీఎం చంద్రబాబు ప్రతిపాదన... కేంద్రం ఓకే

  • రెగ్యులర్ ట్రైన్‌గా తిరుపతి - సాయినగర్ షిర్డీ ఎక్స్‌ప్రెస్
  • సీఎం చంద్రబాబు ప్రతిపాదన మేరకు నిర్ణయం తీసుకున్నామన్న రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్
  • ప్రముఖ పుణ్యక్షేత్రాలైన తిరుపతి - షిర్డీ మధ్య భక్తులకు ప్రయాణం సులభతరం అవుతుందన్న రైల్వే శాఖ  
తిరుపతి నుంచి సాయినగర్ షిర్డీ వరకు తాత్కాలిక ప్రాతిపదికన నడుస్తున్న ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ (రైలు నం. 07637/07638)కు రైల్వే శాఖ శాశ్వత హోదా కల్పించింది. ఈ మేరకు రైలును క్రమబద్ధీకరించి రెగ్యులర్ రైలుగా కొనసాగించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలియజేశారు.

  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జూన్ 2న రాసిన లేఖను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని మంత్రి వెల్లడించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ చంద్రబాబుకు ఆయన లేఖ రాశారు.

ఈ రైలు రేణిగుంట, ధర్మవరం, రాయచూరు, షోలాపూర్, దౌండ్ స్టేషన్ల మీదుగా తిరుపతి నుంచి షిర్డీ వరకు ప్రయాణిస్తుంది. రైలును వారానికి ఒకటి లేదా రెండుసార్లు నడిపేందుకు ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయి.

ఈ రైలు ద్వారా తిరుపతి, షిర్డీ పుణ్యక్షేత్రాల మధ్య భక్తులకు ప్రయాణం సులభతరం అవుతుంది. విశ్వసనీయమైన, అందుబాటు ధరల్లో రవాణా సౌకర్యం లభిస్తుందని రైల్వే శాఖ పేర్కొంది. 


More Telugu News