నాతో ఏదో చెప్పించాలని ట్రై చెయ్యొద్దు సార్: డైరెక్టర్ క్రిష్ ఫైర్

  • తాజా ఇంటర్వ్యూలో క్రిష్ అసహనం 
  • కల్యాణ్ గారి ప్రాజెక్టుపై ఐదేళ్లు ఉన్నానన్న క్రిష్  
  • తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లిపోవలసి వచ్చిందని వ్యాఖ్య 
  • ఎవరితో ఎలాంటి గొడవలు లేవని వెల్లడి 
  • ఏదో కుదిపేయాలని చూడకండన్న క్రిష్   

క్రిష్ దర్శకత్వం వహించిన 'ఘాటి' ఈ నెల 5వ తేదీన థియేటర్లకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో ఆయన బిజీగా ఉన్నారు. తాజాగా 'గ్రేట్ ఆంధ్ర'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో క్రిష్ మాట్లాడుతూ అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. "అనుష్క గారితో మళ్లీ ఒక సినిమా చేస్తే బాగుంటుందని అనుకునేవాడిని. ఆమె కూడా మరో ప్రాజెక్టు చేద్దామని అంటూ ఉండేవారు. అలాంటి సమయంలోనే నేను ఈ కథను వినడం జరిగింది. ఈ కథకు అనుష్క గారే కరెక్ట్ అనుకోవడం జరిగింది" అని అన్నారు. 

'హరి హర వీరమల్లు' ప్రాజెక్టు నుంచి ఎందుకు వెళ్లి పోవలసి వచ్చింది?' అనే ప్రశ్నకు క్రిష్ తనదైన శైలిలో స్పందించారు. "దాదాపు ఐదేళ్ల పాటు నేను ఆ ప్రాజెక్టుపై ఉన్నాను. ఇక ఆ తరువాత ప్రాజెక్టుపై నేను దృష్టి పెట్టవలసిన పరిస్థితి వచ్చింది. పవన్ కల్యాణ్ గారు రాజకీయాల్లో బిజీగా ఉండటం వలన, షెడ్యూల్స్ విషయంలో ఒక క్లారిటీ రావడం లేదు. అందువలన నేను మరో డైరెక్టర్ అవసరం ఉందని రత్నం గారికి చెప్పి వెళ్లిపోయాను" అని అన్నారు. 

అయితే ఆ మాటలు నమ్మశక్యంగా లేవనేసరికి క్రిష్ కి కోపం వచ్చేసింది. " సార్ .. నేను మీ ఇంటర్వ్యూలు చాలా చూశాను. ఒక అయిపోయిన సినిమాను గురించి మీరు ఇంతగా లాగుతున్నారు. నేను చెబుతున్నప్పటికీ మీరు కాదు .. కాదు అంటున్నారు. మీరు ఒక పరిశోధన మాదిరిగా ఏదో పట్టుకుని .. ఏదో చెప్పిద్దామని చూస్తున్నారు. ఎలాగైనాసరే కుదిపేద్దాం అనే ఆలోచనలో ఉన్నారు. నేనంటే ఇష్టమని అంటున్నారు. మీరు ఆ మాట అంటే నేను నమ్మాలా?" అంటూ అసహనాన్ని వ్యక్తం చేశారు.



More Telugu News