Virat Kohli: టీమిండియాలో కోహ్లీకి స్పెషల్ ట్రీట్‌మెంట్?.. కొత్త వివాదానికి దారితీస్తుందా?

Virat Kohli Lone Indian Player To Give Fitness Test In London
షార్ట్స్‌లో చూడండి
టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీకి బీసీసీఐ ప్రత్యేక వెసులుబాటు కల్పించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. భారత జట్టులోని మిగతా ఆటగాళ్లందరూ బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో ఫిట్‌నెస్ పరీక్షలకు హాజరుకాగా, కోహ్లీ మాత్రం లండన్‌లోనే ఈ పరీక్షను పూర్తి చేసుకున్నాడు. ఈ పరిణామం క్రీడా వర్గాల్లో కొత్త చర్చకు దారితీసింది.

ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి లండన్‌లో ఉంటున్న విరాట్ కోహ్లీ, అక్కడే తన ఫిట్‌నెస్ పరీక్షను పూర్తి చేసేందుకు బీసీసీఐ నుంచి ప్రత్యేక అనుమతి కోరినట్లు సమాచారం. బోర్డు అనుమతితో జరిగిన ఈ పరీక్షలో కోహ్లీ విజయవంతంగా ఉత్తీర్ణత సాధించినట్లు ఒక జాతీయ మీడియా నివేదిక వెల్లడించింది.

మరోవైపు, కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, మహ్మద్ సిరాజ్ వంటి సీనియర్ ఆటగాళ్లతో పాటు అనేకమంది యువ క్రికెటర్లు బెంగళూరులోని ఎన్‌సీఏకు చేరుకుని తమ ఫిట్‌నెస్ పరీక్షలను పూర్తి చేశారు. యో-యో టెస్టులతో పాటు సాధారణ స్ట్రెంత్ టెస్టులను వీరికి నిర్వహించారు. అయితే, ఏ ఒక్క ఆటగాడు కూడా దేశం వెలుపల ఫిట్‌నెస్ పరీక్షల కోసం అనుమతి కోరకపోవడం గమనార్హం. కేవలం కోహ్లీకి మాత్రమే ఈ మినహాయింపు లభించింది.

ఈ విషయంపై ఒక బీసీసీఐ అధికారిని ప్రశ్నించగా, కోహ్లీ ముందస్తు అనుమతి తీసుకునే ఈ పరీక్ష తీసుకుని ఉంటాడ‌ని చెప్పినట్లు తెలిసింది. అయితే, భవిష్యత్తులో ఇతర ఆటగాళ్లకు కూడా ఇలాంటి వెసులుబాటు కల్పిస్తారా? లేదా? అనే దానిపై స్పష్టత లేదు.

ఇటీవల కాలంలో భారత ఆటగాళ్లు తరచూ గాయాల బారిన పడుతుండటంతో బీసీసీఐ ఫిట్‌నెస్ విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తోంది. ఏ సిరీస్‌కు ఎంపిక కావాలన్నా ఆటగాళ్లందరూ తప్పనిసరిగా ఫిట్‌నెస్ పరీక్షలో నెగ్గాలనే నిబంధనను అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఒక స్టార్ ప్లేయర్‌కు ఇలాంటి మినహాయింపు ఇవ్వడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ వంటి ఆటగాళ్లకు రెండో దశలో ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహించనున్నారు.
Go Back to Shorts
Virat Kohli
BCCI
India cricket
fitness test
NCA
Rohit Sharma
Shubman Gill
Indian team
cricket news

More Telugu News