BSE: స్టాక్ మార్కెట్ మదుపరులకు బీఎస్ఈ హెచ్చరిక.. ఆ 4 సంస్థలతో జాగ్రత్త!

BSE Issues Warning to Stock Market Investors
షార్ట్స్‌లో చూడండి
స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టేవారికి బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) కీలక హెచ్చరిక జారీ చేసింది. టెలిగ్రామ్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమ వేదికలలో చురుకుగా ఉంటూ, గుర్తింపు లేకుండా చట్టవిరుద్ధమైన సేవలు అందిస్తున్న నాలుగు సంస్థల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఒక ప్రకటనలో సూచించింది. ఈ సంస్థలు అందించే ఎలాంటి పథకాలకైనా దూరంగా ఉండాలని స్పష్టం చేసింది.

మనీ టాక్స్ విత్ పాయల్, ఎన్ఎస్ఈ స్టాక్ ప్రో, పీటీఎస్ ప్రభాత్ ట్రేడింగ్, పీటీఎస్ ప్రభాత్ ట్రేడింగ్ సర్వీస్ అనే నాలుగు సంస్థలు స్టాక్ మార్కెట్‌పై ఉచిత సలహాలు, టిప్స్ ఇస్తున్నాయని బీఎస్ఈ గుర్తించింది. అంతేకాకుండా, పెట్టుబడులపై కచ్చితమైన రాబడి వస్తుందని మదుపరులను నమ్మిస్తున్నాయని తెలిపింది. కొన్ని సందర్భాల్లో, పెట్టుబడిదారుల ట్రేడింగ్ ఖాతాలను తామే నిర్వహిస్తామని నమ్మబలుకుతూ, వారి లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్ వంటి అత్యంత రహస్య వివరాలను అడుగుతున్నట్లు బీఎస్ఈ తన ప్రకటనలో వివరించింది.

ఈ సంస్థలకు బీఎస్ఈ వద్ద గానీ, సెబీ వద్ద గానీ రీసెర్చ్ అనలిస్ట్‌గా ఎలాంటి రిజిస్ట్రేషన్ లేదని బీఎస్ఈ స్పష్టం చేసింది. పెట్టుబడిదారులు ఎట్టి పరిస్థితుల్లోనూ తమ ట్రేడింగ్ ఖాతాకు సంబంధించిన యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ వంటి వివరాలను ఇతరులతో పంచుకోవద్దని హెచ్చరించింది. ఇలాంటి గుర్తింపు లేని సంస్థల పథకాలలో పెట్టుబడి పెట్టడం ద్వారా తీవ్రమైన నష్టాలు వాటిల్లే ప్రమాదం ఉందని, ఒకవేళ మోసపోతే బీఎస్ఈ నుంచి ఎలాంటి రక్షణ లేదా వివాద పరిష్కార యంత్రాంగం అందుబాటులో ఉండదని తేల్చి చెప్పింది.

ఇటీవల సెబీ కూడా నకిలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు చూపిస్తూ కొందరు మోసాలకు పాల్పడుతున్నారని మదుపరులను అప్రమత్తం చేసింది. మార్కెట్‌లో జరిగే మోసాలను అరికట్టేందుకు, ఎవరైనా తమ దృష్టికి వచ్చిన విషయాలను తెలియజేయడానికి ప్రత్యేకంగా ఒక 'మార్కెట్ ఇంటెలిజెన్స్ పోర్టల్'ను కూడా సెబీ నిర్వహిస్తోంది. మదుపరులు ఏదైనా సంస్థతో లావాదేవీలు జరిపే ముందు, బీఎస్ఈ వెబ్‌సైట్‌లో వారి రిజిస్ట్రేషన్ వివరాలను సరిచూసుకోవాలని సూచిస్తున్నారు.
Go Back to Shorts
BSE
Bombay Stock Exchange
Stock Market
SEBI
Investment Tips

More Telugu News