బీహార్ తరహాలో ఇక్కడ కూడా ఓట్ల చోరీకి పాల్పడే అవకాశం ఉంది.. అప్రమత్తంగా ఉండాలి: స్టాలిన్
- కేంద్ర ఎన్నికల సంఘంపై సీఎం స్టాలిన్ తీవ్ర ఆరోపణలు
- ఓట్ల సవరణ పేరుతో చోరీకి పాల్పడే అవకాశం ఉందని వ్యాఖ్య
- బీహార్ తరహా పరిస్థితి రాకుండా చూడాలని పిలుపు
డీఎంకే న్యాయవిభాగం కార్యదర్శి, ఎంపీ ఎన్ఆర్ ఇళంగో కుమార్తె వివాహ వేడుకలో స్టాలిన్ తన భార్య దుర్గా స్టాలిన్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశం ప్రస్తుతం అత్యంత క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటోందని అన్నారు. నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన ఎన్నికల సంఘం, కేంద్రంలోని పాలకపక్షానికి అనుకూలంగా పనిచేస్తోందని ఆయన ఆరోపించారు. బీహార్లో జరిగిన ఓట్ల చోరీ ఎంతటి తీవ్ర ప్రభావం చూపిస్తోందో అందరికీ తెలుసని అన్నారు.
బీహార్లో ఓట్ల తొలగింపునకు వ్యతిరేకంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిర్వహించిన నిరసన ర్యాలీలో తాను కూడా పాల్గొన్నానని, దానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని స్టాలిన్ తెలిపారు. అలాంటి పరిస్థితి తమిళనాడులో పునరావృతం కాకుండా డీఎంకే కార్యకర్తలు, మిత్రపక్షాల నాయకులు జాగ్రత్త వహించాలని సూచించారు. ఓటర్ల జాబితా సవరణ పేరుతో అధికారులు ఏవైనా తప్పులు చేయడానికి ప్రయత్నిస్తే వారిని అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం చర్యలను అడ్డుకునేందుకు ఎన్ఆర్ ఇళంగో న్యాయపోరాటం చేశారని ఈ సందర్భంగా స్టాలిన్ ప్రశంసించారు.
ఈ వివాహ వేడుకకు కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం, డీఎంకే కోశాధికారి టీఆర్ బాలు, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్, మంత్రి సామినాథన్, ఎంపీ తిరుచ్చి శివా తదితర ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.