రేపు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం... రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు

  • తనకు బాస్ లు ఎవరూ లేరన్న రాజాసింగ్
  • స్వతంత్ర అభ్యర్థిగా అసెంబ్లీకి వెళతానని వ్యాఖ్య
  • తెలంగాణలో బీజేపీ భ్రష్టు పట్టిందన్న రాజాసింగ్
తెలంగాణ శాసనసభ సమావేశాలు రేపు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను అసెంబ్లీకి స్వతంత్ర సభ్యుడిగానే హాజరవుతానని, ఇకపై తనను ఎవరూ కట్టడి చేయలేరని ఆయన స్పష్టం చేశారు. 

తెలంగాణలో బీజేపీ పూర్తిగా భ్రష్టుపట్టిపోయిందని రాజాసింగ్ తీవ్రంగా విమర్శించారు. పార్టీలోని కొందరు నేతల వైఖరి వల్లే ఈ దుస్థితి దాపురించిందని, వారి వల్ల పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతోందని ఆరోపించారు. "ఇప్పుడు నాకు ఎవరూ బాస్‌లు లేరు. నన్ను ఎవరూ అదుపు చేయలేరు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం దొరికింది" అని రాజాసింగ్ అన్నారు.

తానుగా మళ్లీ బీజేపీలో చేరే ప్రసక్తే లేదని ఆయన తేల్చిచెప్పారు. కేవలం పార్టీ జాతీయ నాయకత్వం నుంచి పిలుపు వస్తేనే తిరిగి చేరికపై ఆలోచిస్తానని చెప్పారు. రాజాసింగ్ చేసిన ఈ వ్యాఖ్యలు అసెంబ్లీ సమావేశాల ముందు బీజేపీలో కలకలం రేపాయి.


More Telugu News