Botsa Satyanarayana: ఇండియా కూటమి అభ్యర్థికి చంద్రబాబు మద్దతిస్తారా?: బొత్స

Will Chandrababu support India Alliance candidate asks Botsa Satyanarayana
షార్ట్స్‌లో చూడండి
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై అధికార కూటమి ప్రభుత్వం తన వైఖరిని తక్షణమే వెల్లడించాలని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. విశాఖలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కూటమి నేతలు విస్మరించారని తీవ్రంగా విమర్శించారు. స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించబోమని శాసనమండలిలో పవన్ కల్యాణ్, లోకేశ్ హామీ ఇచ్చారని గుర్తుచేశారు. కానీ ఇప్పుడు 32 విభాగాలను ప్రైవేటు వ్యక్తులకు ఎందుకు అప్పగిస్తున్నారని ఆయన ప్రశ్నించారు.

విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నినదించిన నేతలు ఇప్పుడు మౌనంగా ఉండటం సరికాదన్నారు. ఈ నెల 30న విశాఖలో జరగనున్న జనసేన సమావేశంలో పవన్ కల్యాణ్ ఈ విషయంపై ప్రజలకు సమాధానం చెప్పాలని బొత్స డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ విశాఖ పర్యటనకు వచ్చినప్పుడు స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడకుండా, గిన్నిస్ బుక్ రికార్డులపై దృష్టి పెట్టారని ఎద్దేవా చేశారు. స్టీల్ ప్లాంట్ అంశాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లే బాధ్యత చంద్రబాబు, పవన్‌లకు లేదా? అని నిలదీశారు. ఉక్కు పరిశ్రమ పరిరక్షణ కోసం కార్మిక, ప్రజా సంఘాలను కలుపుకొని త్వరలోనే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని, అవసరమైతే ప్రధాని వద్దకు కూడా వెళతామని స్పష్టం చేశారు.

రాష్ట్రపతి ఎన్నికల విషయంలో వైసీపీ వైఖరిని వివరిస్తూ, సంఖ్యాబలం ఉన్నప్పుడు ఏకగ్రీవ ఎన్నికకు తాము ఎప్పుడూ మద్దతిచ్చామని తెలిపారు. ఇండియా కూటమి అభ్యర్థికి చంద్రబాబు మద్దతిస్తారా? అని ఆయన ప్రశ్నించారు. 

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలన అన్ని రంగాల్లో విఫలమైందని బొత్స సత్యనారాయణ ఆరోపించారు. మంత్రులు, ఎమ్మెల్యేలపై అవినీతి ఆరోపణలు వస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో దోపిడీలు, దౌర్జన్యాలు, భూ కబ్జాలు పెరిగిపోయాయని విమర్శించారు. అర్హులైన దివ్యాంగుల పెన్షన్లను తొలగిస్తున్నారని, వారి సమస్యలపై ప్రభుత్వం మానవత్వంతో స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 30లోగా దివ్యాంగుల సమస్యలు పరిష్కరించకపోతే, కలెక్టర్లను కలిసి పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
Go Back to Shorts
Botsa Satyanarayana
Visakha Steel Plant
Vizag Steel Plant Privatization
Chandrababu Naidu
Pawan Kalyan
Janasena
TDP
India Alliance
Andhra Pradesh Politics
Steel Plant Protest

More Telugu News