అరుదైన మెదడు వాపు వ్యాధితో తొమ్మిదేళ్ల బాలిక మృతి

  • కోజికోడ్ జిల్లాలోని తొమ్మిదేళ్ల బాలికకు అమీబిక్ ఎన్‌కెఫలిటిస్
  • ఈ ఏడాది జిల్లాలో మొత్తం నాలుగు కేసులు నమోదయ్యాయన్న వైద్యులు
  • కలుషిత నీటిలో ఉండే అరుదైన "బ్రెయిన్ ఈటింగ్ అమీబా" వల్ల ఈ వ్యాధి వస్తుందన్న వైద్య నిపుణులు  
కేరళ రాష్ట్రంలోని కోజికోడ్ జిల్లాలో తొమ్మిదేళ్ల బాలిక మృతికి అరుదైన మెదడు వాపు వ్యాధి అమీబిక్ ఎన్‌కెఫలిటిస్ కారణమని రాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారులు నిన్న ధృవీకరించారు. కలుషిత నీటిలో ఉండే అరుదైన "బ్రెయిన్ ఈటింగ్ అమీబా" వల్ల ఈ వ్యాధి వస్తుందని వైద్య నిపుణులు వెల్లడించారు.

కోళికోడ్ జిల్లాలోని త‌మరస్సేరీకి చెందిన బాలిక జ్వరం, తలనొప్పి వంటి లక్షణాలతో బాధపడుతుండటంతో ఈ నెల 13న కుటుంబ సభ్యులు సమీప ఆసుపత్రిలో చేర్పించారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మరుసటి రోజు కోజికోడ్ వైద్య కళాశాలలకు తరలించగా, అదే రోజు చికిత్స పొందుతూ బాలిక మృతి చెందింది. మైక్రోబయాలజీ పరీక్షల్లో అమీబిక్ ఎన్‌కెఫలిటిస్ వ్యాధి కారణంగా బాలిక మరణించిందని వైద్యులు స్పష్టంచేశారు.

ఈ వ్యాధికి సంబంధించి ఈ ఏడాది జిల్లాలో మొత్తం నాలుగు కేసులు నమోదయ్యాయని వైద్యులు వెల్లడించారు. మరోవైపు ఈ వ్యాధి సోకడానికి కారణమైన అమీబా గురించి అన్వేషించడానికి వైద్య నిపుణుల సూచన మేరకు బాలిక నివాస పరిసరాల్లోని నీటి కాలువలు, చెరువులు వంటి వాటిని అధికారులు పరిశీలిస్తున్నారు. 


More Telugu News