గృహ రుణ గ్రహీతలకు ఎస్‌బీఐ ఝలక్.. వడ్డీ రేట్లు పెంపు

  • ఆర్‌బీఐ రెపో రేటు తగ్గించినా వడ్డీ రేట్లు పెంచిన ఎస్‌బీఐ
  • కొత్తగా గృహ రుణం తీసుకునేవారిపై 25 బేసిస్ పాయింట్ల భారం
  • 7.50 శాతం నుంచి 8.70 శాతం శ్రేణికి చేరిన కొత్త వడ్డీ రేట్లు
  • తక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్నవారిపై ప్రభావం అధికం
  • ఎస్‌బీఐ బాటలోనే ఇతర ప్రభుత్వ బ్యాంకులు నడిచే అవకాశం
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) రెపో రేటును తగ్గించి ప్రజలకు ఊరట కల్పించాలని భావిస్తే, దేశంలోనే అతిపెద్ద రుణదాత అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) మాత్రం గృహ రుణ గ్రహీతలకు షాక్ ఇచ్చింది. కొత్తగా రుణాలు తీసుకునేవారికి వర్తించే వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్ల (0.25%) వరకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది.

ఎస్‌బీఐ తాజా నిర్ణయంతో గృహ రుణాల వడ్డీ రేట్ల శ్రేణి 7.50% - 8.45% నుంచి 7.50% - 8.70%కి మారింది. వడ్డీ రేటు కనీస పరిమితిలో మార్పు లేనప్పటికీ, గరిష్ఠ పరిమితిని పెంచారు. ఈ మార్పు ప్రభావం ముఖ్యంగా తక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్న కస్టమర్లపై అధికంగా పడనుంది. వారు ఇప్పుడు మరింత ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి వస్తుంది.

ప్రజలపై రుణ భారాన్ని తగ్గించే ఉద్దేశంతో ఆర్‌బీఐ వరుసగా మూడుసార్లు రెపో రేటును 5.5 శాతానికి తగ్గించింది. సాధారణంగా రెపో రేటు తగ్గితే ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేట్ (ఈబీఎల్ఆర్)తో అనుసంధానమైన రుణాలు చౌకగా మారాలి. దేశంలోని షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు ఇచ్చే రుణాలలో దాదాపు 60 శాతం ఈబీఎల్ఆర్ ఆధారితమైనవే. రెపో రేటు తగ్గింపుతో రుణాలు చౌకగా మారతాయని గతంలో ఎస్‌బీఐ రీసెర్చ్ విభాగమే ఒక నివేదికలో పేర్కొనడం గమనార్హం.

ప్రస్తుతం యూనియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వంటి ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకులు 7.35% నుంచి 10.10% మధ్య వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. ఇప్పుడు ఎస్‌బీఐ తీసుకున్న నిర్ణయంతో మిగిలిన బ్యాంకులు కూడా వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. వడ్డీ రేట్లు తగ్గించడం రుణ గ్రహీతలకు ప్రయోజనకరమే అయినా, బ్యాంకుల లాభాల మార్జిన్లపై ఒత్తిడి కొనసాగుతోందని ఎస్‌బీఐ వర్గాలు అంతర్గతంగా హెచ్చరించాయి. ఈ ఒత్తిడే తాజా పెంపునకు కారణంగా తెలుస్తోంది.


More Telugu News