TCS: ఉద్యోగం ఆఫర్ చేసింది కానీ...!: టీసీఎస్‌పై కేంద్రమంత్రికి ఫిర్యాదు

TCS Job Offer Complaints to Central Minister
షార్ట్స్‌లో చూడండి
టీసీఎస్ (టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్) ఆఫర్ లెటర్‌లు ఇచ్చి, ఆపై జాయినింగ్ తేదీలు ఇవ్వడం లేదని పలువురు బాధితులు కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయకు ఫిర్యాదు చేశారు. వివిధ కంపెనీల్లో రెండేళ్ల నుంచి ఎనిమిదేళ్ల మధ్య అనుభవం ఉన్న ఉద్యోగులకు టీసీఎస్ కొలువులు ఆఫర్ చేసినట్లు వారు తెలిపారు. ఈ సమస్యపై తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ మేరకు నాస్‌సెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయిస్ సెనెట్ బాధితుల తరఫున కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది.

దాదాపు 600 మందికి ఆఫర్ లెటర్లు ఇచ్చి, జాయినింగ్ తేదీలో మాత్రం జాప్యం చేస్తోందని ఆ లేఖలో పేర్కొన్నారు. దీని కారణంగా ఉద్యోగులు ఆర్థికంగా, మానసికంగా, వృత్తిపరంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది.

నాస్‌సెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయిస్ సెనెట్ జులై 22న కేంద్ర మంత్రి మాండవీయకు లేఖ రాస్తూ, పలు అంశాలను ప్రస్తావించింది. బెంగళూరు, పుణే, హైదరాబాద్, కోల్‌కతా, ముంబై, ఢిల్లీ ప్రాంతాలకు చెందిన వివిధ కంపెనీలలో పని చేస్తున్న పలువురు అభ్యర్థులకు టీసీఎస్ ఆఫర్ లెటర్ ఇచ్చింది. టీసీఎస్‌లో ఉద్యోగం రావడంతో వారు తమ పాత కంపెనీలకు రాజీనామాలు సమర్పించారు. ఆ తర్వాత టీసీఎస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉండగా, కంపెనీ జాయినింగ్‌ను వాయిదా వేసింది. అనంతరం ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో వారు మానసికంగా, ఆర్థికంగా కుంగిపోతున్నారని లేఖలో పేర్కొన్నారు.

ఈ విషయంపై టీసీఎస్ కూడా స్పందించింది. తాము ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటామని తెలిపింది. ఫ్రెషర్స్ అయినా, అనుభవజ్ఞులైనా ఆఫర్ లెటర్ అందుకున్న వారందరూ కంపెనీలో చేరతారని పేర్కొంది. అయితే, వ్యాపారం డిమాండ్ ఆధారంగా జాయినింగ్ తేదీలు ఉంటాయని, కొన్ని సందర్భాల్లో వ్యాపార అవసరాలకు తగినట్లుగా మారుతుంటాయని వెల్లడించింది. అభ్యర్థులతో ఎల్లప్పుడూ సంప్రదింపుల్లో ఉంటామని, వారు కంపెనీలో చేరేందుకు ఎదురు చూస్తున్నామని తెలిపింది.
Go Back to Shorts
TCS
Tata Consultancy Services
Mansukh Mandaviya
NASSCOM
job offers
IT employees

More Telugu News