పవన్ కల్యాణ్ సరసన రెండో కథానాయకిగా రాశీ ఖన్నా

  • ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో రెండో కథానాయకిగా రాశీ ఖన్నా
  • హైదరాబాద్‌లో జరుగుతున్న షూటింగ్ 
  • పవన్ కల్యాణ్ తో కలిసి కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్న నిర్మాణ సంస్థ 
ప్రముఖ నటి రాశీ ఖన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో అగ్ర నటీమణులలో ఒకరిగా ఆమె స్థిరపడ్డారు. దాదాపు దశాబ్ద కాలంగా చిత్ర పరిశ్రమలో ఉన్నప్పటికీ, ఇప్పటివరకు ఆమెకు అగ్ర కథానాయకుడు పవన్ కల్యాణ్‌తో కలిసి నటించే అవకాశం లభించలేదు.

అయితే, పవన్ కల్యాణ్ హీరోగా రూపొందుతున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రంలో ఇప్పటికే శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా, ఈ చిత్రంలో రాశీ ఖన్నా సెకండ్ హీరోయిన్‌గా ఎంపికయ్యారు. ఈ మధ్యకాలంలో టాలీవుడ్‌లో అవకాశాలు తగ్గిన రాశీకి ఇది ఒక మంచి అవకాశం అని ఆమె అభిమానులు భావిస్తున్నారు.

ప్రస్తుతం ఆమె హైదరాబాద్‌లో జరుగుతున్న షూటింగ్‌లో పాల్గొంటున్నారు. పవన్ కల్యాణ్‌తో కలిసి ఆమె కొన్ని కీలక సన్నివేశాల్లో నటిస్తున్నారు. 'గబ్బర్ సింగ్' విజయం తర్వాత పవన్ కల్యాణ్, హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ఇది. నవీన్ ఏర్నేని, వై రవిశంకర్ సంయుక్తంగా మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 


More Telugu News