కాకాణిని రెండో రోజు ప్రశ్నిస్తున్న పోలీసులు

  • కనుపూరు చెరువు మట్టి తవ్వకాల కేసులో విచారణ
  • వెంకటాచలం పోలీస్ స్టేషన్‌కు తరలించిన పోలీసులు
  • వ్యాపార, రాజకీయ సంబంధాలపై ప్రశ్నల వర్షం
కనుపూరు చెరువులో అక్రమంగా మట్టి తవ్వకాలు జరిపారన్న ఆరోపణలతో నమోదైన కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డిని పోలీసులు రెండో రోజు కూడా తమ కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి కీలక సమాచారం రాబట్టేందుకు అధికారులు ఆయన్ను లోతుగా ప్రశ్నిస్తున్నారు.

ఈ ఉదయం నెల్లూరు జిల్లా జైలు నుంచి కాకాణిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, విచారణ నిమిత్తం వెంకటాచలం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. న్యాయవాది సమక్షంలో జరుగుతున్న ఈ విచారణ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. విచారణ ముగిసిన అనంతరం ఆయన్ను తిరిగి జిల్లా జైలుకు పంపనున్నారు.

మొదటి రోజు విచారణలో భాగంగా పోలీసులు కాకాణిపై దాదాపు 30 ప్రశ్నలు సంధించినట్లు సమాచారం. ముఖ్యంగా ఆయన రాజకీయ, వ్యాపార సంబంధాలపై దృష్టి సారించారు. ఈ కేసులో రెండో నిందితుడిగా (ఏ2) ఉన్న మందల వెంకట శేషయ్యతో ఉన్న పరిచయాలు, అల్లంపాటి నిరంజన్ రెడ్డితో జరిపిన ఆర్థిక లావాదేవీల గురించి పోలీసులు కూపీ లాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ కోణంలోనే రెండో రోజు విచారణ కూడా సాగుతోందని సమాచారం.



More Telugu News