ఐదు దేశాల పర్యటనను ముగించుకుని భారత్‌కు చేరుకున్న మోదీ

  • 8 రోజుల విదేశీ పర్యటన ముగించుకుని భారత్‌కు వచ్చిన ప్రధాని
  • ఒకే పర్యటనలో మూడు దేశాల అత్యున్నత పురస్కారాలు
  • 2014 నుంచి మోదీకి ఇప్పటివరకు 27 అంతర్జాతీయ పురస్కారాలు
ప్రధాని మోదీ తన ఎనిమిది రోజుల విదేశీ పర్యటనలో అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. ఒకే పర్యటనలో ఏకంగా మూడు దేశాల అత్యున్నత పౌర పురస్కారాలను స్వీకరించిన ఆయన, తన పర్యటనను విజయవంతంగా ముగించుకుని భారత్‌కు తిరిగి వచ్చారు.

ఈ పర్యటనలో భాగంగా బ్రెజిల్, నమీబియా, ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశాలు తమ అత్యున్నత పౌర పురస్కారాలను ప్రధాని మోదీకి అందించి సత్కరించాయి. 2014లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మోదీ విదేశీ ప్రభుత్వాల నుంచి అందుకున్న అంతర్జాతీయ పురస్కారాల సంఖ్య దీనితో 27కు చేరింది.

మొత్తం 8 రోజుల పాటు సాగిన ఈ పర్యటనలో ప్రధాని మోదీ ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియాతో సహా ఐదు దేశాలను సందర్శించారు. గ్లోబల్ సౌత్‌లో భారతదేశ ప్రభావాన్ని పెంచడం, ద్వైపాక్షిక సంబంధాలను పటిష్టం చేయడం, ఆర్థిక సహకారాన్ని ప్రోత్సహించడం ఈ పర్యటన ముఖ్య ఉద్దేశ్యాలు.

బ్రెజిల్‌లో జరిగిన 17వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్న మోదీ.. ప్రపంచ ఆర్థిక పాలన, సుస్థిర అభివృద్ధి వంటి అంశాలపై ఉన్నత స్థాయి చర్చలు జరిపారు. అలాగే, అర్జెంటీనాతో వాణిజ్యం, పెట్టుబడులు, వ్యవసాయం, రక్షణ రంగాల్లో సహకారంపై చర్చించగా.. ఘనా, నమీబియా దేశాల్లో మౌలిక వసతులు, విద్యా భాగస్వామ్యాలపై దృష్టి సారించారు. కరేబియన్ దేశమైన ట్రినిడాడ్ అండ్ టొబాగో పర్యటన ద్వారా ఇరు దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలు మరింత బలపడ్డాయి. 


More Telugu News