Prasanna Kumar Reddy: ప్రసన్నకుమార్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ మహిళా కమిషన్ కు ఫిర్యాదు

కోవూరు నియోజకవర్గంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. టీడీపీ మహిళా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని లక్ష్యంగా చేసుకుని మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నేత నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. ఆయన వ్యాఖ్యలు మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా ఉన్నాయని ఆరోపిస్తూ మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రసన్నకుమార్ రెడ్డిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలంటూ మహిళా సంఘాల నేతలు నేడు రాష్ట్ర మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని మహిళా కమిషన్ చైర్ పర్సన్ రాయపాటి శైలజ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. 

ఓ పార్టీ సమావేశంలో ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై వ్యక్తిగత దూషణలకు దిగారు. ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ఈ ప్రసంగానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. రాజకీయాల్లో మహిళల పట్ల ఇలాంటి భాష వాడటం దారుణమని, ఇది మొత్తం మహిళా లోకాన్ని అవమానించడమేనని పలువురు మహిళా సంఘాల నాయకులు మండిపడ్డారు. ఈ ధోరణికి అడ్డుకట్ట వేయాలని కోరుతూ #YCPInsultsWomen అనే హ్యాష్‌ట్యాగ్‌తో నెటిజన్లు తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు.

ఈ పరిణామాల నేపథ్యంలో సోమవారం రాత్రి నెల్లూరులోని సావిత్రి నగర్‌లో ఉన్న ప్రసన్న కుమార్ రెడ్డి నివాసంపై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇంటి అద్దాలు, ఫర్నీచర్, కారు ధ్వంసమయ్యాయి. దాడి జరిగిన సమయంలో ప్రసన్న కుమార్ రెడ్డి ఇంట్లో లేరు. విషయం తెలుసుకున్న వైసీపీ నేతలు అనిల్ కుమార్ యాదవ్, చంద్రశేఖర్ రెడ్డి తదితరులు ఆయన నివాసాన్ని సందర్శించి దాడిని ఖండించారు. ఈ దాడి వెనుక ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మద్దతుదారుల హస్తం ఉందని, వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని వారు ఆరోపించారు. మాటల యుద్ధంతో మొదలైన ఈ వివాదం దాడుల వరకు వెళ్లడంతో కోవూరులో రాజకీయ ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి.
Prasanna Kumar Reddy
Vemireddy Prasanthi Reddy
Kovur
Andhra Pradesh Politics
Women Commission
YCP
TDP
Nellore
Political Controversy
Attack on Residence

More Telugu News