Chandrababu Naidu: కుప్పంకు ఎయిర్ పోర్టు రానుంది... నియోజకవర్గంలో అన్నీ ఏసీ బస్సులే తిప్పుతాం: సీఎం చంద్రబాబు

Chandrababu Naidu Announces Airport for Kuppam AC Buses Only
షార్ట్స్‌లో చూడండి
ప్రభుత్వ పరంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం ఎంత ముఖ్యమో, వాటిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడం కూడా అంతే కీలకమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. పాలనతో పాటు పార్టీ కార్యక్రమాలకు తాను సమాన ప్రాధాన్యత ఇస్తున్నానని, ఇదే స్ఫూర్తితో కార్యకర్తలు కూడా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. కుప్పం నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు.

"సుపరిపాలనలో తొలి అడుగు.. ఇంటింటి ప్రచారం" అనే కార్యక్రమాన్ని ప్రారంభించామని, దీని ద్వారా ప్రభుత్వ విజయాలను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత కార్యకర్తలదేనని చంద్రబాబు తెలిపారు. "అభివృద్ధికి బ్రాండ్ టీడీపీ అయితే, ఆ టీడీపీకి బ్రాండ్ కార్యకర్తలే. నేతలు అటూ ఇటూ మారుతున్నారేమో కానీ, కార్యకర్తలే శాశ్వతంగా ఉంటారు" అని అన్నారు. గత ప్రభుత్వంలో పెన్షన్లలో కోతలు విధించారని, కానీ తాము అర్హులందరికీ పెన్షన్లు అందిస్తున్నామని, ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేయాలని సూచించారు.

కుప్పం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినట్టు చంద్రబాబు వెల్లడించారు. భవిష్యత్తులో కుప్పంకు ఎయిర్‌పోర్ట్ రానుందని, నియోజకవర్గంలో కేవలం ఏసీ ఎలక్ట్రిక్ బస్సులే నడిచేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 100 శాతం సోలార్ రూఫ్ టాప్‌లు ఏర్పాటు చేయాలని, మల్లప్పకొండ వంటి ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతామని తెలిపారు. హంద్రీ-నీవా జలాలతో కుప్పంలో కరవు అనే మాటే లేకుండా చేస్తామని భరోసా ఇచ్చారు.

ఈ సందర్భంగా పార్టీ నేతలకు చంద్రబాబు గట్టి హెచ్చరిక జారీ చేశారు. ప్రజలకు మేలు చేసే వారే తనకు దగ్గరగా ఉంటారని, ఎవరైనా ప్రజా వ్యతిరేకత మూటగట్టుకుంటే వారిని నిర్మొహమాటంగా పక్కన పెడతానని స్పష్టం చేశారు. ఈ ఫార్ములా కేవలం కుప్పానికే కాదని, రాష్ట్రవ్యాప్తంగా వర్తిస్తుందని తేల్చిచెప్పారు. రాబోయే నెల రోజుల్లో ప్రతి ఇంటికీ వెళ్లి ప్రచారం పూర్తి చేయాలని, పార్టీ పట్ల సానుకూల దృక్పథాన్ని పెంచాలని కార్యకర్తలకు ఆయన లక్ష్యం నిర్దేశించారు.
Go Back to Shorts
Chandrababu Naidu
Kuppam
Andhra Pradesh
TDP
Airport
Electric Buses
Solar Rooftop
Development
Governance
Handri Neeva

More Telugu News