Abbas Araghchi: ఇజ్రాయెల్‌కు అమెరికా అండగా నిలిస్తే అందరికీ ముప్పు తప్పదని ఇరాన్ హెచ్చరిక

ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఘర్షణ వాతావరణం రోజురోజుకూ తీవ్రమవుతున్న నేపథ్యంలో, ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ యుద్ధంలో అమెరికా, ఇజ్రాయెల్‌ పక్షాన చేరితే, అది కేవలం ఇరాన్‌కు మాత్రమే కాకుండా ప్రపంచంలోని ప్రతి ఒక్కరికీ ప్రమాదకరంగా పరిణమిస్తుందని ఆయన హెచ్చరించారు.

ఇజ్రాయెల్‌పై ఇరాన్, ఇరాన్‌పై ఇజ్రాయెల్ పరస్పర దాడులతో యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరాన్‌పై సైనిక చర్యకు అమెరికా కూడా సిద్ధమవుతున్నట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్‌కు మద్దతు ఇవ్వాలా వద్దా అనే అంశంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రెండు వారాల్లోగా నిర్ణయం తీసుకుంటారని వైట్‌హౌస్ వర్గాలు వెల్లడించాయి. ఈ పరిణామాల నేపథ్యంలో అబ్బాస్ అరాఘ్చీ స్పందించారు. అమెరికా సైనిక జోక్యం గురించి ఆ దేశ అధ్యక్షుడు ఆలోచించడం దురదృష్టకరమని ఆయన అన్నారు.

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధాన్ని నివారించేందుకు దౌత్యపరమైన మార్గాలపై చర్చించేందుకు అరాఘ్చీ జెనీవాలో యూరోపియన్ విదేశాంగ మంత్రులతో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, త్వరలోనే మరోసారి భేటీ కావాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఒకవైపు ఇజ్రాయెల్ దాడులకు అమెరికా రహస్యంగా మద్దతు ఇస్తూ, మరోవైపు అణు ఒప్పంద చర్చలకు తమను ఆహ్వానించడం సరికాదని ఆయన విమర్శించారు. ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికాతో అణు చర్చలు జరపడానికి ఇరాన్ సిద్ధంగా లేదని ఆయన స్పష్టం చేశారు.
Abbas Araghchi
Iran
Israel
US
America
Iran Israel conflict
Middle East conflict
nuclear deal
Trump
White House

More Telugu News