Rahul Gandhi: మేక్ ఇన్ ఇండియా చైనాకే మేలు చేస్తోంది: రాహుల్ గాంధీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమం ఆశించిన ఫలితాలు ఇవ్వలేదని, ఇది పూర్తిగా విఫలమైందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శించారు. ఈ పథకం ద్వారా మన దేశం కంటే చైనానే అధికంగా లాభపడుతోందని ఆయన ఆరోపించారు. దేశీయంగా తయారీ రంగం కుంటుపడటంతో నిరుద్యోగం కూడా భారీగా పెరిగిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఇటీవల ఢిల్లీలోని ప్రముఖ ఎలక్ట్రానిక్స్ మార్కెట్ అయిన 'నెహ్రూ ప్లేస్'ను రాహుల్ గాంధీ సందర్శించారు. అక్కడ పనిచేస్తున్న ఇద్దరు టెక్నీషియన్లతో ఆయన ముచ్చటించారు. ఈ సంభాషణకు సంబంధించిన వీడియోను తన ‘ఎక్స్’ ఖాతాలో పంచుకున్న రాహుల్, ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ విధానాలపై తన అసంతృప్తిని వెళ్లగక్కారు.

"మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంతో దేశంలో ఫ్యాక్టరీ రంగం ఊహించని విధంగా అభివృద్ధి చెందుతుందని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. మరి అలాంటప్పుడు తయారీ రంగం ఎందుకు రికార్డు స్థాయిలో కనిష్ఠానికి పడిపోయింది? యువతలో నిరుద్యోగిత రేటు ఎందుకు ఇంతగా పెరిగింది? చైనా నుంచి దిగుమతులు రెట్టింపు ఎందుకయ్యాయి?" అంటూ రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు.

ప్రధాని మోదీ కేవలం నినాదాలు ఇవ్వడంలోనే నిష్ణాతులని, సమస్యలకు పరిష్కారాలు చూపడంలో కాదని ఆయన ఎద్దేవా చేశారు. "2014 నుంచి చూస్తే, మన ఆర్థిక వ్యవస్థలో తయారీ రంగం వాటా 14 శాతానికి తగ్గిపోయింది. నిజం చెప్పాలంటే, మనం వస్తువులను ఇక్కడ కేవలం అసెంబ్లింగ్ చేస్తున్నాం, దిగుమతి చేసుకుంటున్నాం తప్పితే, వాటిని పూర్తిస్థాయిలో తయారుచేయడం లేదు. దీనివల్ల, ఆ వస్తువులను తయారుచేస్తున్న చైనా లాభాల పంట పండించుకుంటోంది" అని రాహుల్ విశ్లేషించారు.

ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలను కూడా ప్రభుత్వం క్రమంగా వెనక్కి తీసుకుంటోందని ఆయన ఆరోపించారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశ తయారీ రంగంలో సంస్కరణలు అత్యవసరమని అభిప్రాయపడ్డారు. "మనం ఇతరులకు కేవలం మార్కెట్‌గా మిగిలిపోకూడదు. మన వస్తువులను మనమే ఇక్కడ ఉత్పత్తి చేసుకోవాలి, ఇక్కడే కొనుగోళ్లు జరపాలి. ఇప్పటికే చాలా సమయం గడిచిపోయింది. ఈ విషయంపై ప్రభుత్వం తక్షణమే నిర్ణయం తీసుకోవాలి" అని రాహుల్ గాంధీ తన పోస్టులో పేర్కొన్నారు.
Rahul Gandhi
Make in India
Narendra Modi
China
Indian Economy
Manufacturing Sector
Unemployment

More Telugu News