Chandrababu Naidu: చంద్రబాబుగారూ... ఇది మీ దుర్మార్గపు పరిపాలన ఫలితమే: జగన్

ముఖ్యమంత్రి చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలో ఒక మహిళను చెట్టుకు కట్టేసి, హింసించిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనపై వైసీపీ అధినేత జగన్ ఎక్స్ వేదికగా తీవ్ర స్థాయిలో స్పందించారు.

"చంద్రబాబు గారూ... రాష్ట్రంలో మహిళలకు మీరు కల్పిస్తున్న రక్షణ  ఇదేనా? మీ పాలనలో మహిళలకు లభిస్తున్న ఆత్మగౌరవం ఇదేనా? సాక్షాత్తూ మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం నారాయణపురం గ్రామంలో ఒక మహిళను చెట్టుకు కట్టేసి, హింసిస్తున్న ఘటన, మీ దుర్మార్గపు పరిపాలన ఫలితమే. తిమ్మరాయప్ప అనే కూలీ అప్పు చెల్లించలేదనే కారణంతో అతని భార్య శిరీషను మీ పార్టీ కార్యకర్త చెట్టుకు కట్టేసి, హింసించాడు. ఆమె బిడ్డలు రోదిస్తున్నా సరే కనికరం చూపలేదు, విడిచిపెట్టలేదు. చంద్రబాబుగారూ.. మీ హయాంలో జరిగిన అనేక క్రూరమైన ఘటనల్లో ఇదొకటి" అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

పొలిటికల్‌ గవర్నెన్స్‌, రెడ్‌బుక్‌ పేరిట మీరు నెలకొల్పిన దుష్ట సంప్రదాయంలో భాగంగా మీరు, మీ పార్టీ నాయకులు రాష్ట్రవ్యాప్తంగా చెలరేగిపోయి చేస్తున్న దుర్మార్గాలకు మహిళలు, యువతులు, బాలికలు ఇలా ఎందరో బలైపోతున్నారని జగన్ మండిపడ్డారు. ఈ ఘటనతోపాటు, ఏడాదికాలంలో రాష్ట్రవ్యాప్తంగా మహిళలపై జరిగిన అన్యాయాలు, అఘాయిత్యాలను సీరియస్‌గా తీసుకోవాలని, చట్టప్రకారం కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు.

Chandrababu Naidu
Andhra Pradesh
Kuppam
YS Jagan
TDP
Woman Harassment
Sirisha
Narayana Puram
Political Governance
Red Book

More Telugu News