కీల‌క పోరులో ముంబ‌యి చిత్తు... ఫైనల్‌కు పంజాబ్‌

  • అహ్మదాబాద్‌ వేదికగా క్వాలిఫయర్‌-2
  • హోరాహోరీగా త‌ల‌ప‌డ్డ ఎంఐ, పీబీకేఎస్‌
  • ఉత్కంఠ విజ‌యంతో ఫైన‌ల్‌కు చేరిన పంజాబ్‌
  • కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆడిన అయ్య‌ర్ (87 నాటౌట్‌) 
  • మంగ‌ళ‌వారం ఫైన‌ల్లో ఆర్‌సీబీతో పంజాబ్ కింగ్స్ ఢీ
ఈ ఐపీఎల్‌ సీజన్‌ ఆసాంతం ఆక‌ట్టుకున్న పంజాబ్‌ కింగ్స్ (పీబీకేఎస్‌) క్వాలిఫయర్‌-1లో ఓడినా క్వాలిఫయర్‌-2లో మాత్రం అదరగొట్టింది. ఆదివారం అహ్మదాబాద్‌ వేదికగా ముంబ‌యి ఇండియన్స్ (ఎంఐ)తో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 5 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ముంబ‌యి నిర్దేశించిన 204 పరుగుల భారీ లక్ష్యాన్ని పంజాబ్‌ 19 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి ఛేదించింది. కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (41 బంతుల్లో 87 నాటౌట్‌) కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాడు. అత‌నికి తోడు మ‌రో స్టార్ బ్యాట‌ర్ నేహాల్ వధేరా (48), జోష్‌ ఇంగ్లిస్‌ (38) పీబీకేఎస్ విజయంలో కిరోల్‌ పోషించారు. 

వ‌ర్షం అంతరాయం క‌లిగించ‌డంతో రెండు గంటల పాటు ఆలస్యంగా మొదలైన మ్యాచ్‌లో టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన ఎంఐ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 203 పరుగుల భారీ స్కోరు చేసి ప్రత్యర్థి ఎదుట కొండంత లక్ష్యాన్ని నిర్దేశించింది. ముంబ‌యి జట్టులోని హైదరాబాదీ కుర్రాడు తిలక్‌ వర్మ (29 బంతుల్లో 44) బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ముందుకొచ్చి మెరుపులు మెరిపించాడు. 

సూర్యకుమార్‌ యాదవ్‌ (26 బంతుల్లో 44) మరోసారి త‌న అద్భుత‌మైన ఫామ్‌ను కొన‌సాగించ‌గా, జానీ బెయిర్‌ స్టో (24 బంతుల్లో 38), నమన్‌ ధీర్‌ (18 బంతుల్లో 37) దూకుడుగా ఆడారు. ఈ విజయంతో పంజాబ్‌ మంగళవారం రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ)తో టైటిల్‌ పోరులో అమీతుమీ తేల్చుకోనుంది.

దంచికొట్టిన తిలక్‌, సూర్యకుమార్‌ 
టాస్‌ గెలిచిన పంజాబ్ కెప్టెన్‌ అయ్యర్‌ మరో ఆలోచన లేకుండా బౌలింగ్‌ ఎంచుకున్నాడు. ఆరంభంలో ఆ జ‌ట్టు బౌలర్లు అతడి నమ్మకాన్ని నిలబెట్టినా తర్వాత గతి తప్పారు. గత మ్యాచ్‌లో అర్ధ శతకంతో రాణించిన రోహిత్‌ శర్మ (8).. పంజాబ్‌తో కీలకపోరులో తేలిపోయాడు. స్టోయినిస్‌ వేసిన మూడో ఓవర్‌లో అతడు విజయ్‌కుమార్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. సాధారణంగా బ్యాటింగ్‌ ఆర్డర్‌లో నాలుగో స్థానంలో వచ్చే తిలక్‌ను ముంబ‌యి ఈసారి వ్యూహం మార్చి ముందుగా పంపించింది. 

ఇక‌, జట్టు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని తిలక్‌ వమ్ముచేయలేదు. ఓపెనర్‌ బెయిర్‌ స్టోతో కలిసి ఎంఐ స్కోరుబోర్డును ఉరకలెత్తించాడు. ఎదుర్కొన్న రెండో బంతినే సిక్సర్‌గా మలిచాడు. అర్ష్‌దీప్‌ వేసిన మరుసటి ఓవర్‌లో బెయిర్‌ స్టో రెండు బౌండరీలు బాదాడు. ఆ త‌ర్వాత‌ అజ్మతుల్లా ఐదో ఓవర్లో అతడు.. 4, 6తో రెచ్చిపోవడంతో పవర్‌ ప్లే ముగిసేసరికి ముంబ‌యి ఒక వికెట్ కోల్పోయి 65 ర‌న్స్ చేసింది. కానీ ఆ తర్వాతి ఓవర్‌లోనే విజయ్‌కుమార్‌.. బెయిర్‌ స్టోను ఔట్‌ చేయడంతో ఎంఐ రెండో వికెట్‌ కోల్పోయింది. 

ఆ త‌ర్వాత క్రీజులోకి వ‌చ్చిన సూర్య‌కుమార్, తిల‌క్ క‌లిసి ముంబ‌యి స్కోరుబోర్డు జెట్ స్పీడ్‌తో ప‌రుగులు పెట్టించారు. ఈ ఇద్దరూ పంజాబ్‌ బౌలర్లను ఉతికారేస్తూ ఒక్కో ఓవర్‌కు 10 పరుగులు తగ్గకుండా పిండుకున్నారు. ఈ ద్వ‌యం దూకుడుగా ఆడి 42 బంతుల్లోనే 72 పరుగుల భాగ‌స్వామ్యం నెల‌కొల్ప‌డం విశేషం. ప్రమాదకరంగా మారుతున్న తిల‌క్‌, సూర్య‌ ద్వయాన్ని చాహల్‌ విడదీశాడు. 

అతడు వేసిన 14వ ఓవర్‌లో సూర్య.. 4, 6 బాదినా ఐదో బంతికి వధేరాకు క్యాచ్‌ ఇచ్చి పెవిలియ‌న్ చేరాడు. ఆ తర్వాత రెండు బంతుల వ్యవధిలోనే తిలక్‌.. జెమీసన్‌ బౌలింగ్‌లో ప్రియాన్ష్‌కు క్యాచ్‌ ఇవ్వడంతో ఎంఐ నాలుగో వికెట్‌ కోల్పోయింది. ముంబ‌యి కెప్టెన్‌ హార్దిక్ పాండ్యా(15) నిరాశపరిచినా ఆఖర్‌లో నమన్ వ‌రుస‌ బౌండరీలతో రెచ్చిపోవ‌డంతో ఆ జ‌ట్టు 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్లు కోల్పోయి 203 పరుగుల భారీ స్కోరు చేసింది. పంజాబ్ ముందు 204 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని నిర్దేశించింది. పంజాబ్ బౌల‌ర్ల‌లో అజ్మతుల్లా 2 రెండు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. స్టోయినిస్, చాహ‌ల్‌, విజ‌య్‌కుమార్‌, జేమిస‌న్ త‌లో వికెట్ తీశారు. 

అద‌ర‌గొట్టిన అయ్యర్‌
204 ప‌రుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పంజాబ్‌.. బౌల్ట్‌ వేసిన ఇన్నింగ్స్‌ మూడో ఓవర్‌లోనే ప్రభ్‌సిమ్రన్‌ (6) వికెట్‌ కోల్పోయింది. అయితే, మరో ఓపెనర్‌ ప్రియాన్ష్‌ (20), మూడో స్థానంలో వచ్చిన జోష్‌ ఇంగ్లిస్‌ (38) దూకుడుగా ఆడటంతో ఛేదనను రసవత్తరంగా మార్చేశారు. ఈ జోడీ రెండో వికెట్‌కు 18 బంతుల్లోనే 42 ప‌రుగులు జోడించింది. కానీ రెండు ఓవర్ల వ్యవధిలో పీబీకేఎస్‌ ఈ ఇద్దరి వికెట్లను కోల్పోయి పీక‌లోతు కష్టాల్లో పడింది. 

అయితే, కెప్టెన్ అయ్య‌ర్‌, నేహాల్ వధేరా ధాటిగా ఆడి పంజాబ్‌ను మళ్లీ గెలుపు రేసులోకి తెచ్చారు. టాప్లీ వేసిన 13వ ఓవర్లో శ్రేయస్‌ హ్యాట్రిక్‌ సిక్సర్లతో రెచ్చిపోతే బౌల్ట్‌ ఓవర్లో వధేరా రెండు బౌండరీలు బాదాడు. కానీ, ఆ త‌ర్వాత‌ నేహాల్, శశాంక్‌ (2) వెంటవెంటనే పెవిలియ‌న్ చేరినా అయ్యర్‌ ధాటిగా ఆడి లాంఛనాన్ని పూర్తి చేశాడు. ముంబ‌యి బౌల‌ర్ల‌లో అశ్వని కుమార్ 2 వికెట్లు తీస్తే.. ట్రెంట్ బౌల్ట్‌, హార్దిక్ పాండ్యా చెరో వికెట్ ప‌డ‌గొట్టారు. ఇక‌, ఈ విజ‌యంతో ఫైన‌ల్‌కు దూసుకెళ్లిన పీబీకేఎస్‌... రేపు (మంగ‌ళ‌వారం) ఇదే వేదిక‌గా ఆర్‌సీబీతో త‌ల‌ప‌డ‌నుంది. 


More Telugu News