న‌టి ప్రీతి జింటా మంచి మ‌న‌సు.. ఆర్మీకి రూ. 1.10 కోట్ల విరాళం

  • సౌత్ వెస్ట్ర‌న్ క‌మాండ్‌లోని సైనిక వితంతువుల సంక్షేమ నిధికి రూ. 1.10 కోట్ల విరాళం
  • కార్పొరేట్ సోష‌ల్ రెస్పాన్సిబిలిటీ  కింద విరాళం అంద‌జేత‌
  • సైనికులు చేసిన త్యాగాల‌కు వెల‌క‌ట్ట‌లేమ‌న్న ప్రీతి జింటా
  • కానీ వారి కుటుంబాల‌కు అండ‌గా ఉందామంటూ న‌టి పిలుపు
ఐపీఎల్ ఫ్రాంచైజీ పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) స‌హ య‌జ‌మాని, న‌టి ప్రీతి జింటా మంచి మ‌న‌సు చాటుకున్నారు. సౌత్ వెస్ట్ర‌న్ క‌మాండ్‌లోని సైనిక వితంతువుల సంక్షేమ నిధి (AWWA)కి రూ. 1.10 కోట్ల విరాళం ప్ర‌క‌టించారు. కార్పొరేట్ సోష‌ల్ రెస్పాన్సిబిలిటీ (CSR) కింద ఈ విరాళం అంద‌జేశారు. 

జైపూర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో సౌత్ వెస్ట్రన్ కమాండ్ ఆర్మీ కమాండర్, ప్రాంతీయ అధ్యక్షుడు శప్తా శక్తి, ఆర్మీ కుటుంబాలు హాజరైన సందర్భంగా ఈ విరాళం అందించారు. వీర నారీమ‌ణుల సాధికారిత‌కు, వారి పిల్ల‌ల చ‌దువు కోసం ఈ మొత్తాన్ని వెచ్చించ‌నున్నారు. సైనికులు చేసిన త్యాగాల‌కు వెల‌క‌ట్ట‌లేమ‌ని, కానీ వారి కుటుంబాల‌కు అండ‌గా ఉందామ‌ని ఈ సంద‌ర్భంగా ప్రీతి జింటా పిలుపునిచ్చారు. 

ఈ సందర్భంగా జైపూర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, "మన సాయుధ దళాల ధైర్యవంతులైన కుటుంబాలకు ఎంతో కొంత సాయం చేయ‌డం అనేది గౌరవం, బాధ్యత రెండూ. మన సైనికులు చేసిన త్యాగాలను నిజంగా తిరిగి చెల్లించలేం. కానీ మనం వారి కుటుంబాలకు అండగా నిలిచి, వారిని ముందుకు సాగడానికి మద్దతు ఇవ్వగలం. భారతదేశ సాయుధ దళాల పట్ల మేము అపారమైన గర్వాన్ని కలిగి ఉన్నాం. మన దేశం, మన ధైర్యవంతులైన దళాలకు మ‌ద్ద‌తుగా నిలబడతాం" అని ప్రీతి జింటా అన్నారు.


More Telugu News