KCR: కాళేశ్వరం దర్యాప్తులో మలుపు.. మాజీ సీఎం కేసీఆర్ విచారణకు రంగం సిద్ధం!

కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ప్రాజెక్టులో కీలక పాత్ర పోషించారని భావిస్తున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను విచారించిన (క్రాస్ ఎగ్జామినేషన్ చేసిన) తర్వాతే ప్రభుత్వానికి తుది నివేదిక సమర్పించాలని జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ యోచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ పరిణామం నేపథ్యంలో కమిషన్ గడువును ప్రభుత్వం మరో రెండు నెలల పాటు పొడిగించింది.

వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం జస్టిస్ ఘోష్ కమిషన్ గడువు ఈ నెలాఖరుతో ముగియాల్సి ఉంది. మాజీ సీఎం కేసీఆర్‌తో పాటు, గత ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌లను విచారించకుండానే, కమిషన్‌కు అందిన పత్రాల ఆధారంగా వారి పాత్రను అంచనా వేసి, వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని కమిషన్ మొదట భావించినట్లు సమాచారం. ఈ నెల 22వ తేదీ తర్వాత ఎప్పుడైనా నివేదిక సమర్పించవచ్చని కమిషన్ గతంలో సంకేతాలు కూడా ఇచ్చింది.

అయితే, ఒక వ్యక్తిపై అభియోగాలు నమోదు చేసేటప్పుడు, ఆ ఆరోపణలపై సదరు వ్యక్తి వివరణ ఇచ్చుకోవడానికి అవకాశం కల్పించాలన్నది సహజ న్యాయసూత్రం. ఈ సూత్రాన్ని అనుసరించి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను విచారణకు ఆహ్వానించి, ఆయన అభిప్రాయాలు, వివరణలు తీసుకున్న తర్వాతే ముందుకు సాగాలని కమిషన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కమిషన్ విచారణ గడువును జులై 31వ తేదీ వరకు పొడిగిస్తూ సోమవారం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్ బొజ్జా జీవో జారీ చేశారు.

త్వరలోనే కేసీఆర్‌కు కమిషన్ సమన్లు పంపించే అవకాశాలున్నాయని, సమన్లు అందిన వారం రోజుల్లోగా విచారణకు హాజరుకావాలని కమిషన్ కోరవచ్చని సమాచారం. గతంలో ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోలు, యాదాద్రి, భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణాలపై విచారణ జరిపిన జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి కమిషన్ కూడా కేసీఆర్‌కు సమన్లు పంపింది. ‘మీ మీద ఫలానా వ్యక్తులు ఆరోపణలు చేశారు. వారిని క్రాస్ ఎగ్జామినేషన్ చేయడానికి మీకు అవకాశం ఇస్తున్నాం’ అంటూ ఆ సమన్లలో పేర్కొన్నారు. అయితే, విచారణ పూర్తికాకుండానే తనను దోషిగా ప్రకటించేలా జస్టిస్ నర్సింహారెడ్డి ప్రకటనలు చేస్తున్నారంటూ కేసీఆర్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. 

దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు.. జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి వ్యవహారశైలిపై అభ్యంతరాలు వ్యక్తం చేసి, ఆయన్ను విచారణ బాధ్యతల నుంచి తప్పించింది. ఆ తర్వాత విద్యుత్ విచారణ కమిషన్ బాధ్యతలు స్వీకరించిన జస్టిస్ మదన్ భీంరావు లోకూర్ ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోలు, యాదాద్రి, భద్రాద్రి థర్మల్ నిర్మాణాలను సమర్థిస్తూ కేసీఆర్ రాసిన లేఖనే ఆయన అభిప్రాయాలుగా పరిగణనలోకి తీసుకున్నారు. ఈ పూర్వపు అనుభవాల నేపథ్యంలో జస్టిస్ ఘోష్ కమిషన్ మరింత జాగ్రత్తగా, పకడ్బందీగా వ్యవహరిస్తూ, కేసీఆర్‌కు తన వాదన వినిపించుకునే పూర్తి అవకాశం కల్పించాలని భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది.
KCR
Kaleshwaram project
Kaleshwaram investigation
Telangana irrigation project
Justice Pinaki Chandra Ghose Commission
Harish Rao
Etela Rajender
Telangana news
Telangana politics
irrigation project

More Telugu News