మేం ఎందుకు దాడి చేశామంటే!: పాకిస్థాన్ విదేశాంగ శాఖ మంత్రి కీలక వ్యాఖ్యలు

India and Pakistan Border Tensions Escalate Ishaq Dars Response
భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ, పాకిస్థాన్ నుంచి కీలక ప్రకటన వెలువడింది. భారత్ సైనిక చర్యలు నిలిపివేస్తే, ఉద్రిక్తతలు తగ్గించేందుకు తాము కూడా చర్యలు తీసుకుంటామని పాకిస్థాన్ విదేశాంగ శాఖ మంత్రి ఇషాక్ దార్ స్పష్టం చేశారు.

"మా సహనం నశించాకే ప్రతిస్పందించాం. భారత్ ఇక్కడ ఆగిపోతే, మేము కూడా ఆగిపోయే అంశాన్ని పరిశీలిస్తాం" అని ఇషాక్ దార్ పాకిస్థాన్‌కు చెందిన జియో న్యూస్‌తో అన్నారు. భారత్ మళ్లీ దాడులకు పాల్పడితే, తమ ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. ఈ విషయాన్ని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోకు తెలియజేశానని వెల్లడించారు. రెండు గంటల క్రితం న్యూఢిల్లీతో మాట్లాడిన అనంతరం రూబియో తనను సంప్రదించారని దార్ తెలిపారు. పాకిస్థాన్ సంయమనం పాటిస్తే, ఘర్షణలను పెంచబోమని భారత్ ఇదివరకే స్పష్టం చేసింది.

దేశం ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్థిక సంక్షోభం, క్షీణిస్తున్న ప్రజల జీవన పరిస్థితుల నేపథ్యంలో, యుద్ధ వాతావరణం మరింత నష్టం కలిగిస్తుందన్న ఆందోళన పాక్‌లో వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే, ఉద్రిక్తతలను తగ్గించి, న్యూఢిల్లీతో చర్చలు జరపడానికి ఇస్లామాబాద్ సిద్ధంగా ఉందని పాక్ అధికారిక వర్గాలు తెలిపాయి. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించి, శాంతియుత వాతావరణం నెలకొల్పాల్సిన అవసరం ఉందని ఆ వర్గాలు అభిప్రాయపడ్డాయి.

భారత్-పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరకుండా ఇరు దేశాలు సంయమనం పాటించాలని, దాడుల నివారణకు చర్యలు తీసుకోవాలని అమెరికా సూచించింది. ఈ నేపథ్యంలో పాక్ విదేశాంగ మంత్రి తాజా ప్రకటనకు ప్రాధాన్యత ఏర్పడింది.

అయితే, పాకిస్థాన్ ఒకవైపు శాంతి మంత్రం పఠిస్తూనే, మరోవైపు కవ్వింపు చర్యలను కొనసాగిస్తోంది. గురువారం రాత్రి నుంచి భారత సరిహద్దు ప్రాంతాలపై దుస్సాహసానికి పాల్పడుతూనే ఉంది. బారాముల్లా నుంచి గుజరాత్‌లోని భుజ్ వరకు దాదాపు 26 ప్రాంతాలపైకి డ్రోన్లను ప్రయోగించింది.

ముఖ్యంగా శ్రీనగర్ విమానాశ్రయం, అవంతీపురాలోని వైమానిక స్థావరం లక్ష్యంగా చేసుకుని డ్రోన్లతో విఫలయత్నం చేయగా, భారత బలగాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయి. శనివారం కూడా జమ్ము ఫిరోజ్‌పుర్, పఠాన్‌కోట్, జైసల్మేర్, బాడ్‌మేడ్, భుజ్ వంటి కీలక ప్రాంతాల్లోకి డ్రోన్లను పంపేందుకు పాక్ సైన్యం ప్రయత్నించింది. అప్రమత్తంగా ఉన్న భారత సైనికులు ఈ ప్రయత్నాలను భగ్నం చేసి, డ్రోన్లను కూల్చివేశారు.
Go Back to Shorts
Ishaq Dar
Pakistan Foreign Minister
India-Pakistan tensions
Drone attacks
Military actions
Indo-Pak conflict

More Telugu News