Vikram Doraiswami: పాక్ ఫేక్ ప్రచారంపై భారత రాయబారి సెటైర్.. మీ ఇగో సంతృప్తి చెందుతుందంటే అలాగే అనుకోండని వ్యాఖ్య

- భారత విమానాల కూల్చివేతపై పాక్ తప్పుడు ప్రచారం
- పాకిస్థాన్ వాదనలు ఖండించిన యూకేలోని భారత రాయబారి విక్రమ్ దొరైస్వామి
- భారత్ ఎప్పుడూ సైనిక ఘర్షణను కోరుకోలేదని వెల్లడి
భారత్ చేస్తున్న ప్రతీకార దాడులను ఎదుర్కోలేక పాకిస్థాన్ తప్పుడు ప్రచారం చేస్తోందని లండన్ లోని భారత రాయబారి విక్రమ్ దొరైస్వామి ఆరోపించారు. భారత విమానాలను కూల్చివేసినట్లు పాక్ నిరాధార ఆరోపణలు చేస్తోందని విమర్శించారు. దీనిపై మీడియా అడిగిన ప్రశ్నలకు జవాబిస్తూ.. భారత యుద్ధ విమానాలను కూల్చేశామని చెప్పుకుంటే వారి అహం సంతృప్తి చెందుతుందంటే అలాగే చెప్పుకోనివ్వండని ఎద్దేవా చేశారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలను కట్టిపెట్టి ఉద్రిక్తతలను తగ్గించుకునే మార్గం చూడాలని హితవు పలికారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం ఇకనైనా ఆపాలని సూచించారు.
పహల్గామ్లో పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు పర్యాటకులపై జరిపిన మారణకాండే ప్రస్తుత ఉద్రిక్తతలకు కారణమని దొరైస్వామి చెప్పారు. ఈ మారణకాండకు బదులిచ్చేందుకు భారత్ చేపట్టిన "ఆపరేషన్ సింధూర్" లక్ష్యం ఉగ్రవాద శిబిరాలేనని స్పష్టం చేశారు. ఇది కచ్చితమైన, లక్షితమైన, సహేతుకమైన మరియు నిగ్రహంతో కూడిన చర్య అని ఆయన వివరించారు. "మేము పాకిస్థాన్ సైనిక స్థావరాలపై గానీ, జాతీయ మౌలిక సదుపాయాలపై గానీ దాడి చేయలేదు. సైనిక ఘర్షణను నివారించడమే మా ప్రధాన లక్ష్యం" అని దొరైస్వామి తెలిపారు.