Raj Kumar Thappa: పాక్ దుశ్చర్య.. రాజౌరిలో షెల్లింగ్ దాడిలో జమ్మూకశ్మీర్ అధికారి మృతి

- సీఎం ఒమర్ అబ్దుల్లా తీవ్ర దిగ్భ్రాంతి
- నిన్నటి సమావేశంలో పాల్గొన్న అధికారి
- పహల్గామ్ దాడికి ప్రతీకారంగా భారత్ దాడుల అనంతరం పాక్ ఆగడాలు
- పౌర ప్రాంతాలపై పాక్ భారీ షెల్లింగ్, డ్రోన్ దాడులు
- సరిహద్దుల్లో అప్రమత్తత.. ప్రజలకు రక్షణ శాఖ కీలక సూచనలు
జమ్మూకశ్మీర్లోని రాజౌరి సెక్టార్లో పాకిస్థాన్ మరోసారి తన దుందుడుకు వైఖరిని ప్రదర్శించింది. పౌర నివాసాలను లక్ష్యంగా చేసుకుని శనివారం ఉదయం జరిపిన భారీ షెల్లింగ్లో జమ్మూకశ్మీర్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్కు చెందిన సీనియర్ అధికారి రాజ్ కుమార్ థాపా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేవలం కొన్ని గంటల ముందే థాపాతనతో ఆన్లైన్ సమావేశంలో పాల్గొన్నారని ఆయన గుర్తు చేసుకున్నారు.
రాజౌరి పట్టణంలోని అదనపు జిల్లా అభివృద్ధి కమిషనర్గా పనిచేస్తున్న రాజ్ కుమార్ థాపా నివాసంపై పాకిస్థాన్ దళాలు జరిపిన ఫిరంగి దాడిలో ఆయన మరణించినట్లు అధికారులు ధ్రువీకరించారు. ఈ విషాద ఘటనపై ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఎక్స్ వేదికగా స్పందించారు. "రాజౌరి నుంచి అత్యంత విచారకరమైన వార్త. జమ్మూకశ్మీర్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్కు చెందిన నిబద్ధత కలిగిన అధికారిని కోల్పోయాం. నిన్ననే ఆయన డిప్యూటీ సీఎం వెంట జిల్లాలో పర్యటించారు. నేను అధ్యక్షత వహించిన ఆన్లైన్ సమావేశంలో పాల్గొన్నారు. ఈరోజు రాజౌరి పట్టణాన్ని లక్ష్యంగా చేసుకుని పాక్ జరిపిన షెల్లింగ్లో ఆయన నివాసం దెబ్బతిని, మరణించారు. ఈ భయంకరమైన ప్రాణనష్టానికి నా దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేయడానికి మాటలు రావడం లేదు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను" అని ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు.
బీజేపీ నేత రవీందర్ రైనా కూడా థాపా మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. "ఆయన చాలా ధైర్యవంతుడు, ప్రజలతో స్నేహపూర్వకంగా మెలిగే అధికారి. దేశానికి, సమాజానికి అత్యంత చిత్తశుద్ధితో సేవలందించారు" అని రైనా అన్నారు.
జమ్మూకశ్మీర్ నుంచి రాజస్థాన్ వరకు వాయవ్య సరిహద్దు వెంబడి పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని నివాస ప్రాంతాలపై పాక్ దాడులకు తెగబడుతోంది. ప్రార్థనా స్థలాలను కూడా లక్ష్యంగా చేసుకుంటూ డ్రోన్ల వర్షం కురిపిస్తోంది. జమ్మూలోని ఓ ప్రాంతంలో పాక్ దాడుల కారణంగా ఇళ్లు ధ్వంసమై, వాహనాలు దెబ్బతిన్న దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. పలు నగరాల్లో అడపాదడపా ప్రమాద సైరన్లు మోగుతూనే ఉన్నాయి. భారత వాయు రక్షణ వ్యవస్థ డ్రోన్లు, క్షిపణులను సమర్థవంతంగా అడ్డుకుంటోంది. పాకిస్థాన్ రెచ్చగొట్టకుండానే భారీ షెల్లింగ్కు పాల్పడుతుండగా, భారత దళాలు సమర్థవంతంగా తిప్పికొడుతున్నాయి. ఈ ప్రతిదాడుల్లో పాకిస్థాన్కు చెందిన కీలక రక్షణ వ్యవస్థలు ధ్వంసమైనట్లు సమాచారం.
"భారత సాయుధ దళాలు అత్యంత అప్రమత్తంగా ఉన్నాయి. ఇటువంటి వైమానిక ముప్పులను కౌంటర్-డ్రోన్ వ్యవస్థల ద్వారా నిరంతరం ట్రాక్ చేసి, నిరోధిస్తున్నారు. పరిస్థితిని నిశితంగా, నిరంతరంగా పర్యవేక్షిస్తున్నాం, అవసరమైన చోట తక్షణ చర్యలు తీసుకుంటున్నాం" అని రక్షణ మంత్రిత్వ శాఖ ఎక్స్లో వివరించింది. "ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల పౌరులు ఇళ్లకే పరిమితం కావాలి. అనవసర ప్రయాణాలను తగ్గించుకోవాలి, స్థానిక అధికారులు జారీ చేసే భద్రతా సూచనలను ఖచ్చితంగా పాటించాలి. ఆందోళన చెందాల్సిన అవసరం లేనప్పటికీ, అప్రమత్తత, ముందుజాగ్రత్త చాలా అవసరం" అని రక్షణ శాఖ సూచించింది.