Rohit Raju: తెలంగాణ ప్రభుత్వం 'ఆపరేషన్ చేయూత' ఎఫెక్ట్... 38 మంది మావోయిస్టుల లొంగుబాటు

- ఛత్తీస్గఢ్లో వివిధ కేడర్లలో పనిచేసిన సభ్యులు
- లొంగిపోయినవారికి తక్షణ ఆర్థిక సహాయం అందజేత
- ఈ ఏడాది ఇప్పటివరకు 265 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు పోలీసులు వెల్లడి
తెలంగాణ ప్రభుత్వ కల్పిస్తున్న పునరావాస విధానాలు, శాంతియుత జీవనంపై ఆశతో, నిషేధిత సీపీఐ-మావోయిస్టు పార్టీకి చెందిన 38 మంది సభ్యులు శుక్రవారం నాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఛత్తీస్గఢ్లో వివిధ హోదాల్లో పనిచేస్తున్న వీరు జనజీవన స్రవంతిలో కలిసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఎదుట ఈ 38 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో ఇద్దరు పార్టీ సభ్యులు, 16 మంది మిలీషియా సభ్యులు, ఏడుగురు గ్రామ కమిటీ సభ్యులు, ఆరుగురు క్రాంతికారి ఆదివాసీ మహిళా సంఘటన్ సభ్యులు, ముగ్గురు చేతన నాట్యమంచ్ సభ్యులు, నలుగురు గెరిల్లా రివల్యూషనరీ డిస్ట్రిక్ట్స్ సభ్యులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. లొంగిపోయిన వారికి పునరావాసం నిమిత్తం ప్రభుత్వం తరపున తక్షణ ఆర్థిక సహాయంగా చెక్కులను ఎస్పీ అందజేశారు.
తెలంగాణ ప్రభుత్వం లొంగిపోయిన మావోయిస్టుల సంక్షేమం కోసం తీసుకుంటున్న చర్యలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సంయుక్తంగా గిరిజన ప్రాంతాల్లో చేపడుతున్న 'ఆపరేషన్ చేయూత' వంటి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి తెలుసుకున్న వీరు, మావోయిజం మార్గాన్ని వీడి, తమ కుటుంబ సభ్యులతో ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని నిర్ణయించుకున్నారని ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు.
ప్రభుత్వం కల్పిస్తున్న పునరావాస సౌకర్యాలకు ఆకర్షితులై వివిధ కేడర్ల మావోయిస్టులు ఆయుధాలు వీడి లొంగిపోతున్నారని ఎస్పీ పేర్కొన్నారు. లొంగిపోయిన వెంటనే వారికి అందాల్సిన ప్రతిఫలాలను తెలంగాణ ప్రభుత్వం తరపున పోలీసులు అందజేస్తున్నారని వారు గ్రహించారని, ఇప్పటికే లొంగిపోయిన వారు ప్రభుత్వ సౌకర్యాలను పొందుతూ తమ కుటుంబాలతో శాంతియుత జీవితం గడుపుతున్నారని వివరించారు. ఈ ఏడాది ఇప్పటివరకు కొత్తగూడెం పోలీసుల ఎదుట 265 మంది మావోయిస్టు పార్టీ సభ్యులు లొంగిపోయినట్లు ఎస్పీ వెల్లడించారు.
కొంతకాలంగా నిషేధిత సీపీఐ-మావోయిస్టు పార్టీ గిరిజనుల మద్దతు, విశ్వాసం కోల్పోయిందని, వారి కాలం చెల్లిన సిద్ధాంతాలతో ఏజెన్సీ ప్రాంత అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నారని ఎస్పీ ఆరోపించారు. ఏజెన్సీ ప్రాంతం అభివృద్ధి చెందితే తాము మనగడ సాగించలేమని వారు భావిస్తున్నారని అన్నారు.
"అమాయక గిరిజనులు జీవనోపాధి కోసం నిత్యం తిరిగే ప్రాంతాల్లో ల్యాండ్మైన్లు అమర్చి వారిని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. మావోయిస్టు పార్టీ నాయకుల దుశ్చర్యల వల్ల గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందరు అమాయక గిరిజనులను పోలీసు ఇన్ఫార్మర్ల నెపంతో మావోయిస్టులు హత్య చేస్తున్నారు, హింసిస్తున్నారు" అని రోహిత్ రాజు తెలిపారు.
జనజీవన స్రవంతిలో కలిసి సాధారణ జీవితం గడపాలనుకునే పార్టీ సభ్యులు తమ సమీపంలోని పోలీస్ స్టేషన్ లేదా జిల్లా ఉన్నతాధికారులను వారి కుటుంబ సభ్యుల ద్వారా గానీ, నేరుగా గానీ సంప్రదించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. లొంగిపోయిన పార్టీ సభ్యుల జీవనోపాధికి, పునరావాసానికి ప్రభుత్వం తరపున అన్ని రకాల ప్రయోజనాలు అందేలా జిల్లా పోలీసు యంత్రాంగం నిరంతరం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. "తెలంగాణ ప్రాంతానికి చెందిన అగ్రశ్రేణి మావోయిస్టు నాయకులు జనజీవన స్రవంతిలో కలవాలనుకుంటే, వారికి ప్రత్యేక నగదు పురస్కారాలు, ఇతర పునరావాస సౌకర్యాలు తక్షణమే అందించేందుకు పోలీసు శాఖ కృషి చేస్తుంది" అని ఆయన తెలిపారు.