Pawan Kalyan: భారత బలగాలకు రక్షణగా పవన్ కల్యాణ్ కీలక పిలుపు

- పాక్తో ఉద్రిక్తతల వేళ సైన్యానికి పవన్ మద్దతు
- ఆపరేషన్ సిందూర్ కు నైతిక మద్దతుగా ప్రార్థనలు చేయాలని పిలుపు
- జనసేన ఆధ్వర్యంలో పలు ప్రముఖ ఆలయాల్లో ప్రత్యేక పూజలు
పాకిస్థాన్తో సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో, భారత సైనిక దళాలకు మద్దతుగా నిలవాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. భారత బలగాలు శత్రుదేశంపై చేపడుతున్న 'ఆపరేషన్ సిందూర్' ఒక ధర్మయుద్ధమని అభివర్ణించిన ఆయన, ఈ ఆపరేషన్ విజయవంతం కావాలని, దేశానికి నాయకత్వం వహిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, సైన్యానికి దైవబలం, ఆశీస్సులు లభించాలని ఆకాంక్షిస్తూ ప్రతి ఒక్కరూ ప్రార్థనలు చేయాలని కోరారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
శత్రు సేనలను నిలువరించి, దేశాన్ని పరిరక్షించేందుకు అవసరమైన గొప్ప శక్తిసామర్థ్యాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం మన త్రివిధ దళాలకు పుష్కలంగా ఉన్నాయని పవన్ కల్యాణ్ తన ప్రకటనలో పేర్కొన్నారు. ఈ క్లిష్ట సమయంలో దేశమంతా సైనికుల కోసం ప్రార్థించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. జనసేన పార్టీ తరఫున రాబోయే మంగళవారం నాడు తమిళనాడులోని ఆరు ప్రసిద్ధ షణ్ముఖ క్షేత్రాలైన తిరుత్తణి, తిరుచెందూరు, పళని, తిరుపరంకుండ్రమ్, స్వామిమలై, పలముదిరచోళైలలో ప్రత్యేక పూజలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా ప్రతి క్షేత్రానికి ఒక శాసనసభ్యుడిని, జన సైనికులను పంపించి పూజలు నిర్వహిస్తామని ఆయన వివరించారు.
వీటితో పాటు, కర్ణాటకలోని కుక్కే సుబ్రహ్మణ్య, ఘాటీ సుబ్రహ్మణ్య క్షేత్రాల్లో... ఆంధ్రప్రదేశ్లోని మోపిదేవి, బిక్కవోలు సుబ్రహ్మణ్య ఆలయాల్లో, విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో, పిఠాపురంలోని శ్రీ పురూహూతికా దేవి ఆలయంలో కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు పవన్ కల్యాణ్ వెల్లడించారు. అంతేకాకుండా, ఈ ఆదివారం శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలోని శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో, సైన్యానికి సూర్య శక్తి తోడుగా ఉండాలని ఆకాంక్షిస్తూ పూజలు చేయనున్నట్లు ఆయన తెలిపారు.
రాష్ట్రంలోని ఇతర ప్రముఖ క్షేత్రాల్లో కూడా భారత సైన్యం కోసం, యుద్ధ వాతావరణం నెలకొన్న జమ్మూకశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, హర్యాణా రాష్ట్రాల ప్రజల క్షేమం కోరుతూ పూజలు నిర్వహించాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. క్రైస్తవ విశ్వాసులు చర్చిలలో, ఇస్లాంను ఆచరించేవారు మసీదులలో తమ ప్రార్థనలు కొనసాగించాలని ఆయన సూచించారు. దేశ సమగ్రత, సార్వభౌమత్వం కోసం పోరాడుతున్న సైనికులకు ఆధ్యాత్మిక అండదండలు అందించడం ప్రతి పౌరుడి బాధ్యత అని ఆయన గుర్తుచేశారు.