Colonel Sofia Khureshi: మహిళా ఆర్మీ అధికారులకు శాశ్వత కమిషన్ నిరాకరణ... సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

- మహిళా ఆర్మీ ఆఫీసర్ల రిలీజ్పై సుప్రీం స్టే
- మహిళా అధికారుల సేవలు వినియోగించుకోండి: కేంద్రానికి సుప్రీం ఆదేశం
- ప్రస్తుత పరిస్థితుల్లో వారి స్థైర్యం దెబ్బతీయొద్దని హితవు
షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్ఎస్సీ) కింద ఎంపికై, శాశ్వత కమిషన్ (పీసీ) తిరస్కరణకు గురైన మహిళా ఆర్మీ అధికారుల విషయంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో వారిని సర్వీసు నుంచి విడుదల చేయవద్దని, వారి సేవలను దేశం ఉపయోగించుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఈ మేరకు శుక్రవారం జరిగిన విచారణలో ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది.
మహిళా ఆర్మీ అధికారులకు శాశ్వత కమిషన్ నిరాకరించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా, దేశ సరిహద్దుల్లో నెలకొన్న సున్నితమైన పరిస్థితులను పరోక్షంగా ప్రస్తావిస్తూ, "వారు తెలివైన అధికారులు. వారి సేవలను మీరు వేరే చోట ఉపయోగించుకోవచ్చు. ఇది కోర్టు చుట్టూ తిరగాల్సిన సమయం కాదు. దేశానికి సేవచేయడానికి వారికంటూ మంచి స్థానం ఉంది. వారి స్థైర్యాన్ని దెబ్బతీయవద్దు" అని ధర్మాసనం హితవు పలికింది. పిటిషనర్లుగా ఉన్న అధికారులను, తదుపరి విచారణ వరకు సర్వీసుల నుంచి విడుదల చేయవద్దని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
కేంద్ర ప్రభుత్వం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) ఐశ్వర్య భాటి వాదనలు వినిపించారు. భారత సైన్యానికి యువ అధికారులు అవసరమని, ఏటా కేవలం 250 మంది సిబ్బందికి మాత్రమే శాశ్వత కమిషన్ మంజూరు చేస్తున్నామని తెలిపారు. మహిళా అధికారుల విడుదలకు సంబంధించి ఎటువంటి స్టే ఇవ్వరాదని ఆమె కోర్టును అభ్యర్థించారు.
మరోవైపు, పిటిషనర్ల తరఫున న్యాయవాది వాదిస్తూ, ఆపరేషన్ సిందూర్ను మీడియాకు వివరించిన ఇద్దరు మహిళా అధికారులలో ఒకరైన కల్నల్ సోఫియా ఖురేషీ ప్రతిభను ప్రస్తావించారు. సోఫియా గతంలోనూ సుప్రీంకోర్టును ఆశ్రయించారని, ఇప్పుడు ఆమె దేశం గర్వపడేలా సేవలు అందిస్తున్నారని కోర్టు దృష్టికి తెచ్చారు.
కల్నల్ సోఫియా ఖురేషీ ప్రస్తావన
సైన్యంలో మహిళా అధికారులకు శాశ్వత కమిషన్ కల్పించాలన్న డిమాండ్తో మహిళా అధికారులు సుదీర్ఘకాలం న్యాయపోరాటం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో, కల్నల్ సోఫియా ఖురేషీ సాధించిన విజయాలు సుప్రీంకోర్టు దృష్టికి వచ్చాయి. ఆమె సేవలను ఉదాహరణగా చూపుతూ, మహిళలు కూడా ఆర్మీలో శాశ్వత కమిషన్కు అన్ని విధాలా అర్హులేనని 2020 ఫిబ్రవరి 17న సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. అప్పటివరకు మహిళా అధికారుల సేవలను కేవలం షార్ట్ సర్వీస్ కమిషన్కే పరిమితం చేస్తూ, వారి శారీరక స్వభావం, సామాజిక పరిస్థితులను కారణంగా చూపుతూ పీసీ నిరాకరిస్తున్న వాదనలను న్యాయస్థానం తోసిపుచ్చింది.
పుణెలో 2016లో జరిగిన 'ఎక్సర్సైజ్ ఫోర్స్ 18' బహుళజాతి సైనిక విన్యాసాలకు అప్పటి లెఫ్టినెంట్ కల్నల్ సోఫియా ఖురేషీ (ఆర్మీ సిగ్నల్ కోర్) భారత బృందానికి నాయకత్వం వహించి, ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించారు. అలాగే, 2006లో ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక దళంలో భాగంగా కాంగోలో ఆమె విశిష్ట సేవలందించారు. సోఫియా వంటి అధికారుల విజయాలను పరిగణనలోకి తీసుకునే సుప్రీంకోర్టు మహిళలకు శాశ్వత కమిషన్ అర్హతను కల్పించింది.
ప్రస్తుత విచారణలోనూ ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం, తదుపరి విచారణ వరకు పిటిషనర్లుగా ఉన్న మహిళా అధికారులను విడుదల చేయరాదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.