గూగుల్లో మరోసారి లేఆఫ్స్.. ఈసారి ఎంతమందిని తొలగించిందంటే..!
- సేల్స్, పార్ట్నర్షిప్ విభాగాలను పర్యవేక్షించే 200 మంది ఉద్యోగులపై వేటు
- కంపెనీలో పునర్వ్యవస్థీకరణ చర్యల్లో భాగంగానే లేఆఫ్స్ ప్రకటించినట్లు సమాచారం
- నెల రోజుల వ్యవధిలోనే గూగుల్ తన ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటించడం ఇది రెండోసారి
సేల్స్, పార్ట్నర్షిప్ విభాగాలను పర్యవేక్షించే తమ గ్లోబల్ బిజినెస్ ఆర్గనైజేషన్లో 200 మంది ఉద్యోగులను తొలగించినట్లు సమాచారం. ఈ మేరకు కంపెనీకి చెందిన విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి. 'రాయిటర్స్'కు ఇచ్చిన ప్రకటనలో గూగుల్ ఈ మార్పులను చిన్న సర్దుబాట్లుగా అభివర్ణించింది. కంపెనీలో పునర్వ్యవస్థీకరణ చర్యల్లో భాగంగానే లేఆఫ్స్ ప్రకటించినట్లు తెలుస్తోంది.
ఇక నెల రోజుల వ్యవధిలోనే గూగుల్ తన ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటించడం ఇది రెండోసారి కావడం గమనార్హం. గత నెలలో కూడా ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్, పిక్సెల్ ఫోన్లు, క్రోమ్ బ్రౌజర్లలో పనిచేసే ఉద్యోగులపై వేటు వేసింది. ఇక గతేడాది అంటే 2024 డిసెంబర్లో 10 శాతం మంది ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. అంతకుముందు ఏడాది (2023) జనవరిలో 12 వేల మంది ఉద్యోగులకు గూగుల్ ఉద్వాసన పలికింది. కాగా, 2024 డిసెంబర్ నాటికి కంపెనీ 1,83,000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులను కలిగి ఉంది.