స్నేహం పేరుతో జరిగే నేరాలను ఉపేక్షించం: యూపీ సీఎం యోగిఆదిత్యనాథ్
- ఘజియాబాద్ హత్య ఘటనపై స్పందించిన సీఎం యోగి
- స్నేహం ముసుగులో నేరాలకు పాల్పడితే సహించబోమని హెచ్చరిక
- మోటార్సైకిల్ వివాదంలో సూర్య చౌహాన్ అనే యువకుడి హత్య
- నిందితులు, మృతుడు స్నేహితులని పోలీసుల వెల్లడి
ఒక బహిరంగ కార్యక్రమంలో మాట్లాడుతూ, ఘజియాబాద్లో జరిగిన ఘటన సమాజానికి ఆందోళన కలిగించే విషయమని యోగి అన్నారు. స్నేహితుడిలా నటిస్తూ ఒక వ్యక్తి ప్రాణాలు తీయడం కేవలం నేరమే కాదు, అది పెద్ద ద్రోహమని అన్నారు. ఇలాంటి కేసుల్లో చట్టం తన పని తాను చేసుకుపోతుందని స్పష్టం చేశారు. దోషులకు ఎలాంటి ఉపశమనం లభించదని ఆయన అన్నారు. తప్పుడు మార్గాల్లో వెళుతున్న పిల్లలను సక్రమమార్గంలో మళ్లించలేని తల్లిదండ్రులు పెద్ద తప్పు చేస్తున్నట్లే అన్నారు.
ఏం జరిగింది?
బక్రీద్ రోజున సూర్య చౌహాన్ (19) హత్యకు గురైన విషయం తెలిసిందే. బైక్ నడిపే విషయంలో తగాదా తలెత్తడంతో స్నేహితులే అతడిని హత్య చేశారని పోలీసులు తెలిపారు. ఘజియాబాద్లోని ఖోడా ప్రాంతంలోని నవనీత్ విహార్ కాలనీలో ఈ దారుణం చోటుచేసుకుంది. మే 28న స్థానికంగా నివసించే సూర్య చౌహాన్పై కొందరు కత్తితో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన అతడిని మొదట స్థానిక ఆసుపత్రికి, ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం నోయిడాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సూర్య ప్రాణాలు కోల్పోయాడు.
మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఐదుగురిపై కేసు నమోదు చేశారు. మోటార్సైకిల్ నడిపే విషయంలో మొదలైన చిన్న వివాదం పెద్దదిగా మారి, హింసాత్మక ఘర్షణకు దారితీసిందని, ఈ క్రమంలోనే సూర్య చౌహాన్పై కత్తితో దాడి చేశారని పోలీసులు తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అసద్ పోలీస్ ఎన్కౌంటర్లో మృతి చెందాడు. మిగిలిన వారిని పోలీసులు అంతకుముందే అరెస్టు చేశారు.