Mohammad Khan: అర్ధరాత్రి కాల్పుల శబ్దాలు వినిపించాయి: పాక్ సైన్యం కాల్పులపై ఆర్మీ మాజీ హవల్దార్

- నియంత్రణ రేఖ వద్ద పాక్ సైన్యం ఫిరంగి దాడులు
- పాక్ కాల్పుల్లో బారాముల్లా జిల్లా యూరీ సెక్టార్లో మాజీ ఆర్మీ కమాండో ఇల్లు ధ్వంసం
- ఒంటిగంటకు కాల్పులు ప్రారంభమయ్యాయన్న హవల్దార్ మొహమ్మద్ ఖాన్
- దాడులతో ఇల్లు దెబ్బతినడంతో పిల్లల్ని, భార్యను బయటకు తీసుకువచ్చినట్లు వెల్లడి
జమ్ముకశ్మీర్లోని నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వెంబడి పాకిస్థాన్ సైన్యం బుధవారం తెల్లవారుజామున జరిపిన కాల్పుల్లో బారాముల్లా జిల్లా యూరీ సెక్టార్లో భారత ఆర్మీ మాజీ కమాండో హవల్దార్ మొహమ్మద్ ఖాన్ ఇల్లు పాక్షికంగా దెబ్బతింది. ఈ ఘటనలో ముగ్గురు సాధారణ పౌరులు మరణించగా, పలువురు గాయపడ్డారు.
పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలు, శిక్షణా శిబిరాలపై భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ పేరుతో దాడులు నిర్వహించింది. దీంతో పాకిస్థాన్ సైన్యం సరిహద్దు వెంబడి కాల్పులు ప్రారంభించింది.
ఈ ఘటన గురించి హవల్దార్ మొహమ్మద్ ఖాన్ జాతీయ మీడియాతో మాట్లాడుతూ, "మొదట కొంత కాల్పుల శబ్దం వినిపించింది. అర్ధరాత్రి ఒంటి గంటకు ఇది మొదలైంది. ఆరంభంలో అప్పుడప్పుడు, దూరంగా శబ్దాలు వచ్చాయి. కానీ, 2:30 గంటల సమయానికి కాల్పుల మోత పెరిగి, ఫిరంగి దాడులు ఆరంభమయ్యాయి" అని తెలిపారు.
"నా ఇల్లు దెబ్బతినడంతో నా పిల్లలను, భార్యను బయటకు తీసుకొచ్చాను. కాల్పులు ఇంకా కొనసాగుతాయని నాకు తెలుసు. కాబట్టి వారిని సురక్షితంగా ఉండటానికి నేలపై పడుకోమని చెప్పి, నేనూ పడుకున్నాను. అప్పుడు ఇల్లంతా కంపించడం మొదలైంది" అని ఆయన తన ఇంటి దెబ్బతిన్న భాగాలను చూపుతూ వివరించారు.