Y. Srilakshmi: ఓబుళాపురం మైనింగ్ కేసు... సుప్రీంకోర్టులో శ్రీలక్ష్మికి చుక్కెదురు

Supreme Court Reverses High Court Ruling in Obulapuram Mining Case Against IAS Officer Y Srilakshmi

  • ఓఎంసీ అక్రమ మైనింగ్ కేసులో ఐఏఎస్ శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
  • ఆమెను డిశ్చార్జ్ చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేసిన సర్వోన్నత న్యాయస్థానం 
  • మూడు నెలల్లోగా కేసును తిరిగి విచారించాలని తాజాగా ఆదేశాలు 
  • హైకోర్టు తీర్పు ప్రభావం లేకుండా విచారణ చేపట్టాలని స్పష్టీకరణ
  • ఇదే కేసులో గాలి జనార్దనరెడ్డి తదితరులకు నిన్న సీబీఐ కోర్టు శిక్షలు ఖరారు

 ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసీ) కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారిణి వై. శ్రీలక్ష్మికి సర్వోన్నత న్యాయస్థానంలో ఊహించని పరిణామం ఎదురైంది. ఈ కేసు నుంచి ఆమెను విముక్తురాలిని చేస్తూ (డిశ్చార్జ్ చేస్తూ) గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు పూర్తిగా పక్కన పెట్టింది. ఈ మేరకు సంచలన ఆదేశాలు జారీ చేసింది.

ఓఎంసీ కేసులో శ్రీలక్ష్మి పాత్రపై మూడు నెలల్లోగా మరోసారి విచారణ జరపాలని సుప్రీంకోర్టు ధర్మాసనం నేడు ఆదేశించింది. గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ఎలాంటి సంబంధం లేకుండా, ఆ తీర్పు ప్రభావం పడకుండా స్వతంత్రంగా ఈ విచారణ చేపట్టాలని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. 

కాగా, 2022 సంవత్సరంలో తెలంగాణ హైకోర్టు ఈ కేసులో శ్రీలక్ష్మి దాఖలు చేసుకున్న డిశ్చార్జ్ పిటిషన్‌ను అనుమతించి, ఆమెకు ఊరట కల్పించిన విషయం విదితమే. తాజాగా సుప్రీంకోర్టు ఆ నిర్ణయాన్ని తోసిపుచ్చడంతో శ్రీలక్ష్మికి మళ్ళీ చిక్కులు తప్పేలా లేవు.

ఇదిలావుండగా, ఇదే ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసుకు సంబంధించి ప్రధాన నిందితులకు మంగళవారం నాడు హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టు శిక్షలు ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న గాలి జనార్దనరెడ్డితో పాటు బి.వి.శ్రీనివాసరెడ్డి, వి.డి.రాజగోపాల్, మెఫజ్‌ అలీఖాన్‌లకు న్యాయస్థానం ఏడేళ్ల చొప్పున జైలు శిక్ష విధించింది. వీరికి అదనంగా రూ.20 వేల చొప్పున జరిమానా కూడా విధించింది. అప్పటి ప్రభుత్వ ఉద్యోగి అయిన వి.డి.రాజగోపాల్‌కు అదనంగా మరో నాలుగేళ్ల జైలు శిక్షతో పాటు రూ.2 వేల జరిమానా విధించారు. నిందితులు జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా ఆరు నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని కూడా కోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. ఓబుళాపురం మైనింగ్‌ కార్పొరేషన్‌కు రూ.2 లక్షల జరిమానా విధించారు. వేర్వేరు సెక్షన్ల కింద శిక్షలు పడినప్పటికీ, వాటన్నింటినీ ఏకకాలంలోనే అనుభవించాలని, ఇప్పటికే జైలులో గడిపిన కాలాన్ని శిక్ష నుంచి మినహాయించాలని కూడా న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో శ్రీలక్ష్మి విషయంలో సుప్రీంకోర్టు తాజా ఆదేశాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

Y. Srilakshmi
Obulapuram Mining Case
Supreme Court
Telangana High Court
Illegal Mining
Gali Janardhan Reddy
CBI Court
IAS Officer
Mining Scam
India
  • Loading...

More Telugu News