Sri Tej: శ్రీతేజ్ కోలుకోవడం కోసం మా కుటుంబం అంతా ఎదురుచూస్తోంది: అల్లు అరవింద్

- పుష్ప-2 ఘటన బాధితుడు శ్రీతేజ్ను పరామర్శించిన నిర్మాత అల్లు అరవింద్
- రీహాబిలిటేషన్ సెంటర్కు వెళ్లి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో ఆరా
- శ్రీతేజ్ క్రమంగా కోలుకోవడంపై ఆనందం వ్యక్తం చేసిన అరవింద్
అల్లు అర్జున్ సినిమా 'పుష్ప-2' సినిమా విడుదల సందర్భంగా జరిగిన దురదృష్టకర ఘటనలో గాయపడిన చిన్నారి శ్రీతేజ్ను సినీ నిర్మాత అల్లు అరవింద్ నేడు పరామర్శించారు. కొన్ని నెలల పాటు ఆసుపత్రిలో చికిత్స పొంది, ఇటీవలే డిశ్చార్జ్ అయిన శ్రీతేజ్... ప్రస్తుతం రీహాబిలిటేషన్ సెంటర్లో చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో అల్లు అరవింద్ స్వయంగా రీహాబ్ సెంటర్కు వెళ్లి శ్రీతేజ్ను కలిసి, అతడి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ, శ్రీతేజ్ ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతుండటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. "శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని మా కుటుంబం మొత్తం ఎదురుచూస్తోంది. చిన్నారి రోజురోజుకు కోలుకుంటున్నట్లు తెలియడం చాలా సంతోషంగా ఉంది. చికిత్సకు శ్రీతేజ్ బాగా సహకరిస్తున్నాడని వైద్యులు చెప్పారు. త్వరలోనే శ్రీతేజ్ పూర్తిగా కోలుకుని అందరిలాగే సాధారణ జీవితం గడుపుతాడని ఆశిస్తున్నాను" అని అల్లు అరవింద్ అన్నారు.
శ్రీతేజ్ వైద్య ఖర్చుల నిమిత్తం ఇప్పటికే అల్లు అర్జున్ రూ. 2 కోట్లు అతని ఖాతాలో జమ చేసిన విషయాన్ని కూడా అరవింద్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్ తో పాటు మరో నిర్మాత బన్నీ వాసు కూడా ఉన్నారు.
'పుష్ప-2' సినిమా విడుదల రోజున హైదరాబాద్లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన ప్రమాదంలో శ్రీతేజ్ తీవ్రంగా గాయపడిన సంగతి విదితమే. నెలల తరబడి ఆసుపత్రిలో చికిత్స పొందిన శ్రీతేజ్, కొద్ది రోజుల క్రితమే డిశ్చార్జ్ అయ్యాడు. అయితే, పూర్తిగా కోలుకోవడానికి మరికొంత సమయం పడుతుందని, అందుకోసమే అతన్ని రీహాబిలిటేషన్ సెంటర్కు తరలించినట్లు వైద్యులు గతంలో వెల్లడించారు. అల్లు అరవింద్ తాజా పరామర్శతో శ్రీతేజ్కు అల్లు కుటుంబం అండగా నిలుస్తోందని మరోసారి స్పష్టమైంది.