Samantha: స్టేజీపై లైవ్లో హుషారుగా స్టెప్పులేసిన సమంత.. ఇదిగో వీడియో!

- నిన్న విశాఖలో 'శుభం' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్
- ఈ సినిమాకు నిర్మాతగా హీరోయిన్ సమంత
- ‘సినిమా బండి’ ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల ఈ చిత్రానికి దర్శకుడు
- మూవీ ఈవెంట్లో ఇతర నటీనటులతో కలిసి సామ్ డ్యాన్స్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత చాలా రోజుల తర్వాత స్టేజీపై లైవ్లో డ్యాన్స్ చేశారు. నటిగా మంచి మార్కులు కొట్టేసిన సమంత ఇప్పుడు నిర్మాతగా కూడా అదృష్టం పరీక్షించుకోబోతున్నారు. ఆమె తాజాగా 'శుభం' అనే మూవీని నిర్మించారు. ఇందులో అతిథి పాత్ర కూడా పోషించారు. ‘సినిమా బండి’ ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల ఈ చిత్రానికి దర్శకుడు. మే 9న ఈ మూవీ విడుదల కానుంది. అయితే తన హోమ్ బ్యానర్ నుంచి రాబోతున్న ఫస్ట్ మూవీ కావడంతో సమంత కూడా చాలా యాక్టివ్గా ప్రమోషనల్ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.
ఆదివారం సాయంత్రం ‘శుభం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ను విశాఖపట్నంలో ఘనంగా నిర్వహించారు. సమంతతో సహా సినిమాలో నటించిన నటీనటులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సామ్ మాట్లాడుతూ.. వైజాగ్ లో ఈవెంట్స్ జరుపుకున్న తన సినిమాలన్నీ మంచి విజయం సాధించాయన్నారు. శుభం చిత్రం కూడా విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మూవీ చూశాక అందరు కూడా చిరు నవ్వుతోనే బయటకు వస్తారని పేర్కొన్నారు. తాను నటించిన ‘మజిలీ’, ‘ఓ బేబీ’, ‘రంగస్థలం’ సినిమా ఈవెంట్స్ ఇక్కడే జరిగాయి. ఇక్కడికి వస్తే సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని సమంత అన్నారు.
ఇక సమంతని చూసేందుకు చాలా మంది అభిమానులు వచ్చారు. దాంతో తన ఫ్యాన్స్ను అలరించేందుకు శుభం సినిమాలోని పాటకి సమంత హూషారుగా స్టెప్పులు వేశారు. సమంతతో పాటు ఈ సినిమాలో నటించిన వారు కూడా డ్యాన్స్ చేసి అలరించారు. ఇక ఈ ఈవెంట్లో సమంత కాస్త ఎమోషనల్ కూడా అయ్యారు. తన సినీ కెరీర్ని తలచుకుని సమంత తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. కాగా, శుభం చిత్రంలో హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరి, శ్రీయ కొంతం, శ్రావణి లక్ష్మి తదితర నటీనటులు నటించారు.