KCR: కేసీఆర్ 'డూప్లికేట్ గాంధీ' వ్యాఖ్యలపై జగ్గారెడ్డి ఫైర్

Jagga Reddy Condemns KCRs Attack on Gandhi Family

  • రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి
  • తెలంగాణ ఏర్పాటుకు గాంధీల చుట్టూ తిరిగిన గతం గుర్తుంచుకోవాలని హితవు
  • కేసీఆర్ తన గౌరవాన్ని తగ్గించుకోవద్దని సూచన

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, గాంధీ కుటుంబంపై చేసిన వ్యాఖ్యలపై పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్ తన గతాన్ని పూర్తిగా మర్చిపోయి మాట్లాడుతున్నారని, రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత ఆయనకు లేదని జగ్గారెడ్డి అన్నారు. గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ సభలో గాంధీ కుటుంబాన్ని ఉద్దేశించి కేసీఆర్ 'డూప్లికేట్ గాంధీలు' అని చేసిన వ్యాఖ్యలపై జగ్గారెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. "కేసీఆర్ వయసులో పెద్దవారు. మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. రాహుల్ గాంధీ కుటుంబానికి దేశంలో ఓ ప్రత్యేక చరిత్ర ఉంది. వారిపై విమర్శలు చేసి కేసీఆర్ తనకున్న కొద్దిపాటి గౌరవాన్ని కూడా పోగొట్టుకోవద్దు" అని జగ్గారెడ్డి హితవు పలికారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం గతంలో కేసీఆర్ చేసిన ప్రయత్నాలను ఈ సందర్భంగా జగ్గారెడ్డి గుర్తుచేశారు. "ప్రత్యేక రాష్ట్రం కోసం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇళ్ల చుట్టూ తిరిగిన రోజులు కేసీఆర్ మర్చిపోయారా? వారి అపాయింట్‌మెంట్ కోసం నెలల తరబడి ఢిల్లీలో పడిగాపులు కాసిన సంగతి గుర్తులేదా? రాష్ట్ర విభజనకు ముందు వారు ఒరిజినల్ గాంధీలు, ఇప్పుడు డూప్లికేట్ గాంధీలు అయ్యారా? ఇదేనా కేసీఆర్ రాజకీయ విలువలు?" అని జగ్గారెడ్డి ఘాటుగా ప్రశ్నించారు.

రాజకీయాల్లో ప్రజల పక్షాన నిలిచే హీరో పాత్రను, ప్రజా వ్యతిరేక శక్తుల పాలిట విలన్ పాత్రను కాంగ్రెస్ పార్టీనే పోషిస్తుందని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్ వ్యాఖ్యలు ఆయన స్థాయికి తగవని, రాజకీయ విమర్శలు హుందాగా ఉండాలని సూచించారు. 

KCR
Jagga Reddy
Rahul Gandhi
Congress
BRS
Telangana
Gandhi family
Duplicate Gandhi
Political Controversy
India Politics
  • Loading...

More Telugu News